రైతుల హృదయం నుంచి బడ్జెట్ పుట్టుకొచ్చింది.. నిర్మలా పద్దుపై మోడీ ప్రశంసలు..
బడ్జెట్ను సామాన్యుడిని ఉద్దేశించి రూపొందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అండ్ టీమ్ను ఆయన అభినందించారు. ఈ సారి బడ్జెట్ మాత్రం అపూర్వమైన పరిస్థితి ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్తో ఇండియా ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. బడ్జెట్ వృద్ధికి ఊతమిస్తోందని.. యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
యువత ఉపాధి కోసం మౌలిక వసతుల కల్పన సదుపాయాలు పెంచుతామని చెప్పారు. అయితే బడ్జెట్ చూసి/ విని చాలా మంది నిపుణులు సామాన్యులపై భారం మోపారని కామెంట్ చేశారని మోడీ తెలిపారు. కానీ దీనిని మోడీ ఖండించారు. ఆదాయం, వెల్ నెస్ మరింత పెరుగుతోందని చెప్పారు. అన్నీ రంగాల్లో దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. రైతుల ఆదాయం పెంచేందుకు చక్కగా ప్రణాళికలు రచించారని మోడీ కొనియాడారు. పల్లెల్లో గల రైతుల హృదయం నుంచి ఈ బడ్జెట్ పుట్టుకొచ్చిందని మోడీ అభివర్ణించారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతుల ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని.. పంటకు 1.5 శాతం ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీనిచ్చారు. వ్యవసాయ రుణాలను గణనీయంగా పెంచుతామని హామీనిచ్చారు.
రైతులకు 16.5 లక్షల కోట్ల రుణం ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. గోధుమ పంటకు 2013-14లో రూ.33874 కోట్లు చెల్లించగా.. 2019-2020లో రూ.62802 కోట్లుగా ఉందన్నారు. అదీ 2020-2021కి 75060 కోట్లకు చేరిందని చెప్పారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచుతున్నామని తెలియజేశారు.