చైనాతో ఉద్రిక్తత: కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి 19 శాతం అదనపు కేటాయింపులు
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రక్షణ బలగాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేశారు. గత ఏడాది కంటే 19 శాతం ఎక్కువగా ఈ కేటాయింపులున్నాయి. అంతేగాక, గత 15 ఏళ్లలో అత్యధికంగా కేటాయింపులు జరిగింది ఈ బడ్జెట్లోనే కావడం గమనార్హం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సమర్పించిన కేంద్ర బడ్జెట్లో రక్షణ బడ్జెట్ను రూ. 4.78 లక్షల కోట్లుగా నిర్ణయించింది, ఇందులో కొత్త సైనిక హార్డ్వేర్ కొనుగోలు కోసం రూ. 1.35 లక్షల కోట్ల మూలధన వ్యయం బడ్జెట్ ఉంది.
కాగా, రక్షణ బడ్జెట్ను పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఎంఎస్ సీతారామన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో త్రివిధ దళాలకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే అవకాశం లభించినట్లయింది.
'1.35 లక్షల కోట్ల విలువైన మూలధన వ్యయాన్ని కలిగి ఉన్న ఆర్థిక సంవత్సరం 2021-22లో రక్షణ బడ్జెట్ను 4.78 లక్షల కోట్లకు పెంచినందుకు ప్రధాని, ఆర్థిక మంత్రికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది రక్షణ మూలధన వ్యయంలో దాదాపు 19 శాతం పెరుగుదల. ఇది 15 సంవత్సరాలలో రక్షణ కోసం మూలధన వ్యయంలో అత్యధిక పెరుగుదల' రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
గత ఏడాది బడ్జెట్లో, సాయుధ దళాల ప్రణాళికాబద్ధమైన ఖర్చుల కోసం ఉద్దేశించిన మూలధన బడ్జెట్ కింద రక్షణ దళాలకు, 7 20,776 కోట్ల అదనపు నిధులు ఇచ్చారు. సరిహద్దులో చైనాతో ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో రక్షణ బలగాలకు నిధులను పెంచడం గమనార్హం. చైనా బలగాలను మరింత సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత రక్షణ దళాలకు ఈ కేటాయింపులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
2021 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 9.5 శాతంగా ఉందని, 2022 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి పడిపోతుందని అంచనా వేసిన క్రమంలోనే సీతారామన్.. రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2026 నాటికి ఆర్థిక లోటు 4.5 శాతానికి దిగువకు చేరుకుంటుందన్న నిర్మలా సీతారామన్.. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థకు కష్టతరమైన సంవత్సరం తర్వాత సమర్పించిన కేంద్ర బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును తీర్చడానికి ప్రభుత్వం అదనంగా, రూ. 80,000 కోట్లకు మార్కెట్ను ఆశ్రయిస్తుందని ఎంఎస్ సీతారామన్ తెలిపారు.