బడ్జెట్ 2019 : ఆర్థికలోటుపై అంకెల గారడీ.. నిర్మల తొలి బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 2 సర్కారు జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనన్నారు. అయితే ఈసారి బడ్జెట్లో ఆర్థిక లోటు ఎంత ఉండబోతోందన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అంకెల గారడీని చూపి ఆర్థిక లోటును తగ్గిస్తుందన్న అంశంపై ఇన్వెస్టర్లతో పాటు అనలిస్టుల్లో ఆసక్తి నెలకొంది.
మోడీ హయాంలో పెరగని ఆర్థిక లోటు
మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక లోటు పెరగడం లేదు. అయితే ప్రభుత్వం వాస్తవ లోటును దాచేందుకు బడ్జెటేతర వ్యయాన్ని పెంచుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ ద్వారా రెవెన్యూ, పెట్టుబడి వ్యయాలు చేయడం బడ్జెట్పై విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం చేస్తున్న బడ్జెటేతర రుణాలను పరిగణలోకి తీసుకుంటే భారత ఆర్థిక లోటు ఇప్పటికే అగాధంలోకి కూరుకుపోయిందన్న విషయం అర్థమవుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రతినిధి ప్రసన్న అభిప్రాయపడ్డారు.
సబ్సీడీల బదులు రుణ బాండ్లు
2009 వరకు సవరించిన ఆర్థికలోటులో ఆయిల్, ఫెర్టిలైజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాండ్లను పరిగణలోకి తీసుకునేది. ఈ మధ్యకాలంలో నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీం ఫండ్ రుణాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే బాండ్లను అందులో చేర్చుతోంది. ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీల బదులుగా కేంద్రం వాటికి రుణ బాండ్లు మంజూరు చేస్తోంది. ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విషయంలో ఈ విధానాన్ని అనుసరిస్తోంది. దీని ప్రకారం నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీం ఫండ్ల నుంచి అవసరమైన మొత్తాన్ని ఎఫ్సీఐ రుణంగా తీసుకుంటోంది. దీంతో ఇవి చెల్లించాల్సిన అప్పులుగా మారిపోతున్నాయి.
పెరుగుతున్న అప్పుల బిల్లు
ప్రభుత్వం అనుసరించే క్యాష్ అకౌంటింగ్ సిస్టం ప్రకారం చెల్లించాల్సిన మొత్తాలను వ్యయం కింద చూపే అవకాశం ఉండదు. ఫలితంగా ఆర్థిక లోటు పెరగదు. అయితే రుణ బాండ్ల కారణంగా అప్పుల బిల్లు పెరిగిపోతుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఎఫ్సీఐకు ఇవ్వాల్సిన సబ్సిడీని ఎన్ఎస్ఎస్ఎఫ్ లోన్గా కన్వర్ట్ చేసింది. 2017-18లో ఇది 42 వేల కోట్లు కాగా.. 2018-19లో ఈ మొత్తం 70వేల కోట్లుగా ఉంది.
ఎన్ఎస్ఎస్ఎఫ్ నిధులపై కేంద్రం కన్ను
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఎన్ఎస్ఎస్ఎఫ్కు లోన్ బాండ్లు ఇవ్వడం సబ్సిడీల వరకే పరిమితం కాలేదు. ఎఫ్సీఐ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్ఎఫ్సీ తదితర సంస్థల పెట్టుబడి వ్యయాల కోసం కూడా నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్స్పై కేంద్రం ఆధారపడుతోంది. గతంలో ఎన్ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చేది. అయితే ప్రస్తుతం రాష్ట్రాలు మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకుంటుండటంతో ఆ నిధులపై కేంద్రం కన్నేసింది. సబ్సిడీలు, పెట్టుబడి వ్యయాల కోసం ఆ నిధులను వాడుకుంటూ ఆర్థిక లోటును తక్కువ చేసి చూపుతోంది.
అప్పుల కుప్పగా ప్రభుత్వ సంస్థలు
పెట్టుబడి వ్యయాల కోసం కేంద్రం ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్పై ఆధారపడుతోంది. ఫలితంగా మౌలిక వసతులు, హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్లకు లోన్ బాండ్లు జారీ చేస్తోంది. ఆ మొత్తాలకు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కేంద్రం భరించాల్సి ఉంటుంది. రుణాలను ఆయా సంస్థలు తీసుకుంటున్నందున ఆర్థికలోటుపై దాని ప్రభావం ఉండదు. అయితే ఆయా కంపెనీల ఖాతాల్లో రుణ మొత్తం పెరిగి అప్పుల కుప్పగా మారనున్నాయి. రుణబాండ్లను ఎప్పుడు చెల్లిస్తారన్న స్పష్టత లేకుండా కేంద్రం ఇలాగే కొనసాగిస్తే ఎఫ్సీఐ తదితర సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిన్న మొత్తాలపై పెద్ద వడ్డీ
చిన్న మొత్తాల పొదుపు నిధులకు రుణ బాండ్లకు మళ్లిస్తుండటంతో నిధుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ప్రజలను పొదుపు వైపు మళ్లించేందుకు ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇది ప్రభుత్వానికి మరో భారంగా పరిణమించనుంది. బడ్జెటేతర ఫైనాన్సింగ్ కొత్తేమీ కాకపోయినా గతంలో మోడీ హయాంలో ఆర్థిక లోటు కన్నా ప్రభుత్వ రంగ రుణ సమీకరణ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకత పెంచాలన్న వాదనలు వినిపిస్ుతన్నాయి. చెల్లించని బిల్లుల విషయంలో ప్రభుత్వం కచ్చితమైన అకౌంటింగ్ విధానాన్ని పాటించేలా సంస్కరణలు తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.