ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ ఎత్తివేత -29నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ -క్వశ్చన్ అవర్కు ఓకే: స్పీకర్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల (జనవరి) 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటుకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు..
బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండు సభలు రోజుకు ఐదేసి గంటల చొప్పున భేటీ అవుతాయని, రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే..
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎంపీలందరూ తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఎంపీలకు ఇళ్ల వద్దనే ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 టెస్ట్ లు నిర్వహించేందుకు తగిన ఏర్పాటు చేసినట్లు స్పీకర్ బిర్లా తెలిపారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా,
పార్లమెంట్లోని క్యాంటిన్లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా.. వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది, సందర్శకులే వినియోగించుకుంటున్నారు. ఎంపీలు తక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. అంతేకాదు చివరగా 2016లో మెనూ ధరలను సవరించారు. కోటాను కోట్ల ఆస్తులుండే ఎంపీలకు అతి తక్కువ ధరకే సబ్సిడీపై ఆహారం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ క్యాంటిన్లో ఆహార పదార్థాలపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేశారు. ఈ విషయాన్ని స్పీకర్ బిర్లా తెలిపారు.