30 కోట్ల ఓటర్లే బీజేపీ టార్గెట్?.. ఎన్నికల మంత్రంగా బడ్జెట్?
ఢిల్లీ : 30 కోట్ల మంది ఓటర్లే లక్ష్యంగా బీజేపీ పెద్దలు పావులు కదిపారా? రైతులు, కార్మికులు, వేతన జీవులే టార్గెట్ గా లెక్కలు వేశారా? బడ్జెట్ కూర్పు సమీకరణాలు.. అలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మధ్యంతర బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సందర్భంలో కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అది మధ్యంతర బడ్జెట్ కాదని.. ఓట్ల బడ్జెట్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ ఫర్ ఓట్స్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్.. రైతులు, కార్మికులు, వేతనజీవులను పరిగణనలోకి తీసుకుని లెక్కలేసినట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ కూర్పులో వారికి పెద్దపీట వేశారని చెప్పొచ్చు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేవలం ఓట్ల కోసమే ఈ బడ్జెట్ రూపొందించినట్లుగా ఉందనే వాదనలు లేకపోలేదు. 2019లో మరోసారి కేంద్రంలో గద్దెనెక్కడానికే బీజేపీ ఇలాంటి బడ్జెట్ తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. వేతన జీవులకు ట్యాక్స్ ఊరట, అంసఘటిత కార్మికులకు పింఛను, రైతులకు 6వేల రూపాయల ఆర్థిక సాయం.. అలా ఓటర్లను ఆకర్షించడానికే బడ్జెట్ కూర్పులో ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తుందంటున్నారు కొందరు.
వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్కు ఎంత పన్ను అంటే?
రైతులు, కార్మికులు, వేతనజీవులు..!
తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం మాదిరిగా.. 75 వేల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తెరపైకి తెచ్చింది కేంద్రం. ఈ స్కీమ్ కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు.. సంవత్సరానికి 6వేల రూపాయల ఆర్థికసాయం అందించనుంది. 3 దశల్లో 2వేల రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. దేశవ్యాప్తంగా అమలుచేయనున్న ఈ స్కీమ్ ద్వారా 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా.
"ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్" పేరిట తెరపైకి తీసుకొచ్చిన పథకం ద్వారా.. అసంఘటిత రంగంలోని కార్మికులకు పింఛను ఇవ్వనుంది కేంద్రం. 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి ఈ స్కీమ్ కింద పింఛను లభించనుంది. దీనికోసం 500 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. ఏప్రిల్ నుంచి అమలు కానున్న ఈ స్కీమ్ ద్వారా దాదాపు 10 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
ఇక వేతన జీవులకు ఊరట లభించేలా ఆదాయపు పన్ను పరిమితి శ్లాబ్ ను ఏకంగా 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. దీని ద్వారా 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. పీఎఫ్ సేవింగ్స్ లో ఆరున్నర లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను ఎగ్జెంప్షన్ ఇచ్చారు.
కాంగ్రెస్ గుస్సా..!
కేంద్రం తీరుపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మధ్యంతర బడ్జెట్ పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాదిరి లేదని.. ఓట్ల కోసం బడ్జెట్లా (అకౌంట్ ఫర్ ఓట్స్) ఉందని ఆరోపించారు. పేదలకే దేశ వనరులు పొందే హక్కు ఉంటుందన్న కాంగ్రెస్ ప్రకటనను కాపీ కొట్టినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రూట్ తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాస్తవానికి ఈ బడ్జెట్ లో ఆయా శాఖలకు పద్దులు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికలయి కొత్త ప్రభుత్వం కొలువుదీరేంతవరకు ఏయే శాఖకు ఎంత కేటాయించాలనేది ఈ బడ్జెట్ లో పొందుపరచాలి. కానీ పథకాలు, కేటాయింపులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారనేది విపక్షాల వాదన. మొత్తానికి ఓట్ల టార్గెట్ గా బీజేపీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిందని ప్రధానంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.