అయోధ్యలో హనుమంతుడి విగ్రహాం నెలకొల్పండి, సుందరకాండ పారాయణంతో ఆశీస్సులు: ఆప్ ఎమ్మెల్యే
అయోధ్యలో రామమందిరం నిర్మించే పరిసరాల్లో భారీ హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. రామాలయం నిర్మించే సమయంలో తప్పకుండా హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. అంతేకాదు ఇప్పటికే అయోధ్యలో రామాలయం ఉంది కదా..? మళ్లీ ఎందుకు నిర్మించడం అని నోటిదురుసు ప్రదర్శించారు.
రామాలయానికి బదులు పెద్ద హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని సూచించారు. అంతేకాదు శ్రీరాముడికి హనుమంతుడు అంటే ఇష్టమని పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేసిన మహోన్నతుడు హనుమంతుడు అని భరద్వాజ్ గుర్తుచేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. హనుమంతుడి గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొలిచిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కొందరు ఆప్ నేతలు కూడా హనుమంతుడిపై దైవ భక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఇదే కాదు తన నియోజకవర్గ ప్రజలు రాముడి సుందరకాండ పారాయణం చేయాలని కూడా భరద్వాజ్ సూచించారు. సుందరకాండ పారాయణ చేస్తే హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్నట్టే అని పేర్కొన్నారు. అంతేకాదు ప్రతీ నెల మొదటి మంగళవారం నియోజకవర్గంలో సుందరకాండ పారాయణం చేస్తామని కూడా తెలిపారు. ఇందుకోసం కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వహకులు కూడా ముందుకొచ్చారని ఆయన వివరించారు. అయితే సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యలను మాజీ ఢిల్లీ మీడియా సలహాదారు నాగేందర్ శర్మ విమర్శించారు. అతని ప్రకటన దైవ భక్తి కోసం లేదని, బీజేపీ నుంచి ఆప్ వైపు ఇతరులు మళ్లేందుకు ఉన్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు.