అది రేప్తో సమానం.. బిల్డర్లు మోసాలపై బీజేపీ నేత వింత భాష్యం..
ఢిల్లీ : బిల్డర్ల మోసాలకు బీజేపీ నేత వింత భాష్యం చెప్పారు. వారు ఇంటి కొనుగోలుదారులను మోసం చేయడం అత్యాచారంతో సమానమని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయెల్ జీరో అవర్లో జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మోసాలకు పాల్పడే బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి సంస్థల తరఫున ప్రచారం చేసే సెలబ్రిటీలపైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజయ్ గోయెల్ సూచించారు.
చాలా మంది కొనుగోలుదారులు ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న లక్షల రూపాయల సొమ్ముతో ఇల్లు కొనుగోలు చేస్తారని వారి కష్టార్జితాన్ని అత్యాశాపరులైన బిల్డర్లు మోసం చేసి దోచుకుంటారని విజయ్ అభిప్రాయపడ్డారు. నమ్మించి మోసం చేయడం రేప్ కన్నా తక్కువ నేరమేమీకాదన్న ఆయన.. అలాంటి మోసగాళ్లకు మరణశిక్ష విధించాలని అన్నారు.
హోం ప్రాజెక్టులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడంపైనా విజయ్ గోయెల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు తీసుకుని క్యాంపెయిన్ నిర్వహించే సెలబ్రిటీలను చూసి కస్టమర్లు కొనుగోలుకు ముందుకొస్తారని అన్నారు. అలాంటప్పుడు మోసం జరిగితే అందులో వారికి కూడా శిక్ష విధించాల్సిందేనని గోయెల్ స్పష్టం చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్డర్ల మోసాలను అత్యాచారాలతో పోల్చడాన్ని తప్పుబట్టారు.