ముంబైలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 50 మంది.. (వీడియో)
ముంబైలో ఘోరం జరిగింది. నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గతవారం కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న భవనం కుప్పకూలినట్లు తెలుస్తోంది.
డోంగ్రీలోని అబ్దుల్ హమీద్ దర్గా ప్రాంతంలోని తండేల్ స్ట్రీట్లో ఉదయం 11.40గంటల సమయంలో కేసర్భాయ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో ఎంత మంది ఉన్నారన్న వివరాలు తెలియలేదు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అంటున్నారు.
బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించేందుకు అంబులెన్స్లు సిద్దం చేశారు.