థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణం
థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు.
థానే పాతనగరంలోని నౌపడ ప్రాంతంలో గల బి కేబిన్లోని మంగళవారం తెల్లవారు జామున గం.2.45 నిమిషాల ప్రాంతంలో భవనం కూలింది. భవనం ప్రమాదకరంగా మారిందని, ఎవరూ ఉండకూడదని గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా అందులో కొంత మంది ఉంటూ వచ్చారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ సంజీవ్ జైశ్వాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ యంత్రాలతో సహాయక బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందం శునకాలతో, తగిన పరికరాలతో భవనం చెంతకు చేరుకుంది.