కారు నుంచి లాగి తల్లీ, కూతురుపై గ్యాంగ్రేప్: 15మంది అరెస్ట్
మీరట్: కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అడ్డగించి.. వారిపై దోపిడీకి పాల్పడటమే గాక, కారులోని తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఢిల్లీకి 65కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ-కాన్పూర్ హైవేపై శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 15మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం కారులో షాజహాన్పూర్(యూపీ)కి బయలుదేరింది. హైవేపై బులంద్షహర్ శివారు వద్దకు చేరుకోగానే ఓ ఇనుప రాడ్ కారును ఢీకొట్టింది. దీంతో కంగారు పడ్డ కుటుంబీకులు వాహనాన్ని ఆపి కిందికి దిగారు. అంతలోనే వాళ్లపై దోపిడీదొంగలు విరుచుకుపడ్డారు.
ఒక్కసారిగా దాదాపు 10మంది దుండగులు మీదపడటంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. మొదట డబ్బు, ఆభరణాలను దోచుకున్న దుండగులు.. కుటుంబానికి చెందిన మగవారిని చెట్లకు కట్టేసి, మహిళ(35)ను, ఆమె కూతురు(14)ని పొలాల్లోకి లాక్కెళ్లి తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఎలాగోలా కట్లు విడిపించుకుని అక్కడి నుంచి తప్పించుకున్న కుటుంబసభ్యుడు ఒకరు బులంద్ షహర్ పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన ఘోరాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోగా దుండగులు పరారయ్యారు. తళ్లీ కూతుళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. బందీపోటు ముఠాయే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, చెక్ పోస్టుకు సమీపంలో జరిగిన అకృత్యాన్ని గుర్తించడంలో విఫలమైన సిబ్బంది సహా, శాంతిభద్రతల అదుపులో విఫలమయ్యారని ఓ ఉన్నతాధికారిపై వేటు కూడా పడింది. కాగా, అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బులంద్షహర్ ఎస్ఎస్సీ వైభవ్ కృష్ణ తెలిపారు.