ఓ సామాజిక వర్గమే టార్గెట్గా బులంద్ షెహర్ అల్లర్లు: పోలీసుల నివేదిక
ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్ షెహర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్లర్ల వెనక భారీ కుట్ర జరిగిందని ఓ పోలీసు ఉన్నతాధికారి నివేదిక సమర్పించారు. బులంద్ షెహర్ గర్ముకుటేశ్వర్ జాతీయ రహదారిపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఓ ఊరేగింపు జరుపుతున్న నేపథ్యంలో వారిపై దాడి చేయాలని ముందే కొందరు భావించారని అధికారి తెలిపారు. ఈ విషయాలన్నీ తన విచారణలో బయటపడ్డాయని ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్బీ శిరోద్కర్ తెలిపారు. ఇక దీనికి సంబంధించిన రిపోర్టును ఉత్తర్ ప్రదేశ్ డీజీపీకి అందజేసినట్లు చెప్పిన ఆయన త్వరలోనే ఈ నివేదిక సీఎం యోగీ ఆదిత్యనాథ్కు అందుతుందన్నారు.
బులంద్ షెహర్ అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగాయని చెప్పిన శిరోద్కర్... గోవు మృతదేహం ఘటన జరగక 48 గంటల ముందుది అని అన్నారు. బులంద్ షెహర్ బజరంగ్ దళ్ అధ్యక్షుడు యోగేష్ రాజ్ చెబుతున్నట్లు గోవును సయానా గ్రామంలో చంపలేదని ఏడీజీ చెప్పారు. అంతేకాదు అల్లరి మూకల్లో కొందరు కావాలనే హింసను ప్రేరేపించారని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని చెప్పినప్పటికీ అల్లరి మూకలు రోడ్డును ఖాళీ చేయలేదని అన్నారు.
ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ చెప్పాక ఆ సమూహం మొత్తం ట్రాక్టరులో వెళ్లిపోయారని అయితే గోవు మృతదేహాన్ని ఉంచిన ట్రాలీని మాత్రం అలానే వదిలి వెళ్లిపోయారని రిపోర్టులో పేర్కొన్నారు. ఇలా కావాలనే చేశారని రిపోర్టులో తెలిపారు. మరికొందరిని తీసుకొచ్చేందుకు వారు ట్రాక్టర్లో వెళ్లారని చెప్పారు. దీంతో ట్రాలీని పక్కకు జరుపుదామని పోలీసులు ప్రయత్నించగా అప్పుడు హింస చోటుచేసుకుందని పోలీసు నివేదికలో తెలిపారు.