స్పీడ్గా మోడీ ప్రభుత్వం: రెండో బుల్లెట్ రైలు, ఏ రూట్లో..!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటి బుల్లెట్ రైలును మన దేశంలో ప్రవేశపెట్టాలంటూ తీసుకున్న నిర్ణయం. దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి గుజరాత్లోని అహ్మాదాబాద్ వరకు తొలి బుల్లెట్ రైలుని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా రెండో బుల్లెట్ రైలు తెరపైకి వచ్చింది. ఈ రెండు బుల్లెట్ రైలుని ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి మార్గంలో రానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది
ప్రధాని నరేంద్రమోడీ యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసి-ఢిల్లీల మధ్య బుల్లెట్ రైలుని ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపట్టినట్టు జాతీయ మీడియాలో సోమవారం వార్తలు వచ్చాయి.
వారణాసి నుంచి బయల్దేరే ఈ రెండో బుల్లెట్ రైలు అలీగఢ్, ఆగ్రా, కాన్పూర్, లక్నో, సుల్తానాపూర్ల మీదుగా ఈ రైలు దేశ రాజధానికి చేరుకుంటుంది. ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కితే వారణాసి-ఢిల్లీల మధ్య సమయం 2:40 గంటలకు పైగా తగ్గుతుంది.
కాగా ప్రస్తుతం వారణాసి నుంచి రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే 10 నుంచి 14 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి ఢిల్లీ మధ్య దూరం 506 కిలోమీటర్లు కాగా ఈ ప్రయాణ సమయం కూడా 1:45 గంటలకు తగ్గిపోనుంది. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఈ రెండో బుల్లెట్ రైలును వేగంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ. 43వేల కోట్లుగా వేశారు. మరోవైపు ముంబై-అహ్మాదాబాద్ మధ్య పరుగులెత్తనున్న బుల్లెట్ రైలు 2023 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం జపాన్ ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.