అధికారం పోయిందిగా: అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పట్టాలెక్కడం డౌటేనా?
ముంబై: వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చిట్టచివర కూర్చున్నా అన్నీ అందుతాయనేది ఓ పాత సామెత. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అచ్చం ఈ బేసిక్ ఫార్ములాను అనుసరించేలా కనిపిస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఇప్పుడు పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే- బీజేపీ అక్కడ అధికారాన్ని కోల్పోయింది కాబట్టి.
వైఎస్ జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి: ఏపీ తరహాలో అక్కడా దానిపై నిషేధం..!
శివసేన సారథ్యంలో కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ సంకీర్ణ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఏ క్షణంలోనైనా ఈ మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి ప్రణాళికపై అంగీకారం కుదిరే అవకాశాలు ఉన్నాయి. 40 పాయింట్ల కనీస ఉమ్మడి ప్రణాళికలో పొందుపరిచిన అంశాలపై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య తుది దశ చర్చలు నడుస్తున్నాయి. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ రేసు నుంచి తప్పుకొంది కూడా.
మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అదే స్థాయి ఖర్చుతో కూడుకుని ఉన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్రం పక్కన పెట్టొచ్చని తెలుస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ఈ బుల్లెట్ ట్రైన్ నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, నరేంద్ర మోడీతో కలిసి 2017 సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు. 88 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కింద ప్రత్యేకంగా నేషల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2023 నాటికి అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ను నడిపించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
ప్రాజెక్టునకు అయ్యే వ్యయంలో ఇందులో మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు తమ వాటా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. మహారాష్ట్రలో ఇదివరకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలను విడుదల చేసింది కూడా. అధికారం చేతులు మారిన ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించేయడం గానీ, నాన్చి వేయడం గానీ చేయాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలను రాశాయి.