బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రాష్ట్రానికి భారమే: జయంత్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాకా పలు నిర్ణయాలను తీసుకుంటోంది. ముంబై-అహ్మదాబాదు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలా లేదా అన్న సందిగ్ధంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు కోసం రూ.6.71 లక్షల కోట్లు రాష్ట్రంపై రుణభారం పడనుండటంతో దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.71 లక్షల కోట్లతో పాటు ఇతర పనుల కోసం రూ.2 లక్షల కోట్లు అదనంగా భారం పడుతోందని మంత్రి చెప్పారు.
చిదంబరంకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
అత్యవసర ప్రాజెక్టులపై దృష్టి
రాష్ట్రానికి అత్యవసరంగా కావాల్సిన ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు మంత్రి జంయత్ పాటిల్. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును వాయిదా వేసి తర్వాత ఆలోచిద్దామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. బీజేపీ హయాంలో అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం ఉద్ధవ్ థాక్రే సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మంత్రి జయంత్ పాటిల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై రైతుల వ్యతిరేకత
బుల్లెట్ ట్రైన్ ఖర్చు వివరాలు దానిపై విధివిధానాలు ఏమేరకు ఉంటాయో తెలపాల్సిందిగా ఉన్నతస్థాయి అధికారులతో ఓ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్కు కావాల్సిన భూసేకరణపై రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాణస్వీకారం చేశాక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే ప్రస్తుతం అకాల వర్షాలతో పంట కోల్పోయి దిగాలుగా ఉన్న రైతన్నకు ఏ విధంగా ఊరట కల్పించగలమనేదానిపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు.
బుల్లెట్ ట్రైన్తో ఉపయోగమేంటి..?
ఇదిలా ఉంటే బుల్లెట్ ట్రైన్పై వ్యతిరేకత వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత సచిన్ సావంత్. బుల్లెట్ ట్రైన్తో దేశానికి ఎలాంటి ఉపయోగం చేకూరదని ఆయన చెప్పారు. బుల్లెట్ ట్రైన్తో మహారాష్ట్రలోని వాణిజ్యం వ్యాపారం అంతా గుజరాత్కు తరలించేందుకే బీజేపీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందని సచిన్ సావంత్ మండిపడ్డారు. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్కు విమాన ఛార్జీలు రూ. 3వేలు ఉండగా అదే బుల్లెట్ ట్రైన్ వస్తే ఆ ధరలు నాలుగు రెట్టు పెరుగుతాయని చెప్పారు. ఈ ఛార్జీలు ఎవరు భరిస్తారు ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నించారు.
అమెరికా దేశమే బుల్లెట్ ట్రైన్ను వద్దంటోంది
అభివృద్ధి చెందిన దేశమైన అమెరికానే బుల్లెట్ ట్రైన్స్ వద్దని చెబుతుంటే... అభివృద్ధి చెందుతున్న దేశానికి బుల్లెట్ ట్రైన్ అవసరం ఏంటని ఆయన సచిన్ సావంత్ ప్రశ్నించారు. అంతేకాదు దీనివల్ల వనరులు కోల్పోతామని స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ను థాక్రే వద్దని మాత్రం చెప్పలేదు కానీ దానిపై సమీక్షిస్తామని క్లారిటీ ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మొత్తం 508 కిలోమీటర్ల మేరా ఉంటుంది. ఇందులో 156 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉండగా 4 కిలోమీటర్లు దాదర్ నగర్హవేలీ, మిగతా 348 కిలోమీటర్లు గుజరాత్లో ఉంటుంది.