చైనా టూ భారత్ బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..?
చైనా నుంచి భారత్కు రైలు ఉంటే ఎలా ఉంటుంది...? ఆ ఆలోచనే సూపర్గా ఉంటుంది కదా.. ఇది వాస్తవ రూపం దాల్చేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అవును ఇది నిజం. చైనాలోని కన్మింగ్ నుంచి భారత్లోని కోల్కతా వరకు బుల్లెట్ ట్రైన్ నడిపే యోచనలో చైనా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని చైనా కాన్సుల్ జనరల్ మాజాన్వు తెలిపారు. అనుసంధానం, వాణిజ్య సంబంధాలపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కన్మింగ్ నుంచి కోల్కతాకు రైలులో చేరేందుకు చాలా తక్కువ సమయం తీసుకుంటుందని చెప్పారు.
ఇదిలా ఉంటే మాజాన్వు మాత్రం రైలు రూటు మ్యాప్పై స్పష్టత ఇవ్వలేదు. బంగ్లాదేశ్-చైనా-ఇండియా -మయన్మార్ మధ్య ఉన్న ఎకనామిక్ కారిడార్ పై రైలు మార్గం వస్తుందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే వాస్తవరూపం దాలిస్తే... మయన్మార్లో మాండలేలో, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్, ఢాకా మీదుగా భారత్లోని కోల్కతాకు రైలు చేరుకుంటుంది.
భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని కితాబిచ్చిన మాజాన్వు... తన పొరుగుదేశాలతో ఎప్పటికీ స్థిరమైన సత్సంబంధాలు కొనసాగించాలన్నదే చైనా అభిమతమని అన్నారు. రూపాయి విలువ పతనమైపోతున్నప్పటికీ భారత్ మాత్రం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని ఆర్థిక వ్యవస్థ గాడి తప్పలేదని మాజాన్వు అన్నారు.