ఎయిర్ ఏషియా, ఇండిగో నుంచి.. బంపర్ ఆఫర్!
లోకాస్ట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఏషియా, ఇండిగో తన ప్రయాణికుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. దేశీయంగా ఎంపిక చేసిన మార్గాల్లో అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
న్యూఢిల్లీ: లోకాస్ట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఏషియా తన ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ఎయిర్ ఏషియా రూ.1,299కే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ నెల 5వ తేదీ నుంచి విమాన టికెట్లు అందుబాటులో ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 30లోగా ప్రయాణించే వీలుంది. ఎంపిక చేసిన మార్గాల్లోనే ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఏషియా పేర్కొంది.
ఎయిర్ ఏషియా ఆఫర్ చేసిన మార్గాల్లో టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భువనేశ్వర్-కోల్కతా మార్గంలో రూ.1,299కే టికెట్లు ఆఫర్ చేస్తుండగా.. కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు, గోవా-బెంగళూరు మార్గాల్లో రూ.1,399కే అందుబాటులో ఉంచింది.
భువనేశ్వర్-రాంచి, గువాహటి-ఇంఫాల్ మధ్య టికెట్ ధరను రూ.1,490గా పేర్కొంది. రాంచీ-కోల్కతా మధ్య టికెట్ ధర రూ.1,899 కాగా, కోల్కతా-వడోదర, గోవా-హైదరాబాద్, పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య రూ.1999కే టికెట్లు ఆఫర్ చేస్తోంది.
ఇండిగో నుంచి రూ.1,120కే విమాన టిక్కెట్లు..
విమానయాన సంస్థ ఇండిగో కూడా తన ప్రయాణికుల కోసం 'స్పెషల్ ఆఫర్'లో భాగంగా రూ.1,120కే చెన్నై-బెంగళూరు మార్గంలో విమాన టిక్కెట్లు అందిస్తోంది. అంతేకాదు, జ్మమూ-శ్రీనగర్ మార్గంలో రూ.1,168కి.. ఢిల్లీ-జైపూర్ మార్గంలో రూ.1,178కి టిక్కెట్లు అందిస్తోంది.
ఇక ఇంఫాల్-గువాహటి మార్గంలో రూ.1,212కు.. పూణే-కోల్ కతా మార్గంలో రూ.1,264కు.. భువనేశ్వర్-కోల్ కతా మార్గంలో రూ.1,299కి.. గోవా-బెంగళూరు మార్గంలో రూ.1,316కే టిక్కెట్లు విక్రయిస్తోంది.
అయితే ఇండిగో ప్రయాణికులు నెట్ బ్యాకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టిక్కెట్ల కొనుగోలు చేస్తే మాత్రం రూ.200 అదనంగా కన్వీనియ్స్ ఫీ కింద చెల్లించాల్సి ఉంటుంది.