అక్కడ ఉన్న వారి అదృష్టం... నోట్ల వర్షమే కురిసింది .. ఎక్కడ ... ఎందుకు అంటే ..
Recommended Video
అదృష్టం కలిసి వస్తే ఎక్కడున్నా లక్ష్మీదేవి తలుపు తట్టి మరీ వస్తుంది. అలాంటి అదృష్టమే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని బెంటెక్ స్ట్రీట్లో భవనం వద్ద పనిచేస్తున్న వారిని వరించింది. సడన్ గా వారిపై నోట్ల వర్షం కురిసింది. ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కట్టలు కట్టలుగా , లక్షల రూపాయల నోట్ల వర్షం కురుస్తుంటే అక్కడ ఉన్నవారు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ మీద కురుస్తున్న నోట్ల వర్షానికి సంతోషంలో తేలిపోయి, ఆ నోట్లను ఎంతో ఆరాటంగా తీసుకున్నారు. అసలింతకీ ఏం జరిగింది అంటే
కలకత్తాలోని బెంటిక్ స్ట్రీట్ లో పట్టపగలు నోట్ల వర్షం
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బెంటిక్ స్ట్రీట్లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. అయితే ఈ దాడుల నేపధ్యంలో ఇక ఈ సమాచారం తెలిసిన హూఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఆరో అంతస్తులోని కిటికీ నుండి నోట్ల కట్టలను రోడ్ల మీదకు విసిరేశారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటి అంటే దాడులు చేసిన భవనం వేరు .. డబ్బు పారేసిన భవనం వేరు. అసలు ఎక్కడో పక్క కార్యాలయంలో డీఆర్ ఐ దాడులు చేస్తే పక్క భవనంలో ఉన్నవారు డబ్బు పడేయటమే అసలు ట్విస్ట్ .
గాల్లో తేలుతూ కిందపడుతున్న నోట్లను ఏరుకోటానికి పోటీ పడిన స్థానికులు
దీంతో ఆ భవనం కింద ఉన్న వారు ఆ నోట్లను ఏరుకోవడానికి పోటీపడ్డారు. ఊహించని విధంగా లక్ష్మీదేవి గాల్లో తేలుతూ తమవద్దకు చేరడంతో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఆ డబ్బులను జమ చేసుకున్నారు. 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, వంద రూపాయల నోట్లు గాలిలో తేలుతూ క్రింద పడుతుండడంతో వాటిని ఒడిసిపట్టారు. బుధవారం మధ్యాహ్నం పట్టపగలు నడి రోడ్డు మీద జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
డీఆర్ఐ అధికారుల సోదాల నేపధ్యంలో భయంతో డబ్బు విసిరేసిన సంస్థ
రోడ్లమీద నోట్ల వర్షం కురుస్తుంది అన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా జనాలు వాటి కోసం ఎగబడ్డారు. దీంతో ఆ స్ట్రీట్ లో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. డిఆర్ఐ అధికారులు సోదాలు చేస్తున్న నేపథ్యంలో భయాందోళనకు గురైన పక్కనే ఉన్న కంపెనీ యాజమాన్యం ఇలా డబ్బుల కట్టలను రోడ్డుమీదికి విసరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే డి ఆర్ ఐ అధికారులు మాత్రం తమ సోదాలకు ఈ నోట్లకట్టలకు ఏ విధమైన సంబంధం లేదని తేల్చి చెప్పారు.
అదృష్ట లక్ష్మి వరిస్తే అలాగే నోట్ల వర్షం కురుస్తుందంటున్న స్థానికులు
ఏది ఏమైనా,కారణం ఏదైనా, గాల్లోకి విసరబడిన నోట్లమీద అవి తీసుకున్న వారి పేరు రాసినట్టు ఉంది. అందుకే అవి ఊహించని విధంగా వారి వద్దకు వచ్చి చేరాయి. లక్ష్మీదేవి కటాక్షిస్తే అలాగే ఉంటుంది మరి అంటూ స్థానికంగా చర్చ జరుగుతుంది. ఆ సమయంలో మేం లేకపోయామే అని మరికొందరు నిట్టూరుస్తున్నారట .మొత్తానికి కోల్ కత్తాలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.