బురారీలో 11 మంది సూసైడ్ చేసుకున్న ఆ ఇంటిని కొనుగోలు చేసిన ధైర్యశాలి ఇతనే..!
2018 జూలైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఢిల్లీలోని బురారీలో జరిగింది. మరి 11 మంది విగతజీవులుగా మారిన ఇంటికి మళ్లీ ఎవరైనా వచ్చే సాహసం చేస్తారా..? 100కు 99 మంది చేయరు. కానీ ఆ ఒక్కరు మాత్రం ఆ ఇంట్లో ఉండేందుకు ధైర్యం చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? ఈ ఇంట్రెస్టింగ్ కథ ఏమిటి..?
2018లో 11 మంది సామూహిక ఆత్మహత్య
ఢిల్లీలోని బురారీ ప్రాంతం. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఒకే కుటుంబంలోని 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జూలై 2018లో జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ ఇళ్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంటి వైపు చూసేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. అంతేకాదు ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో నివాసముండే వారు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. రాత్రి అయితే చాలు ఆ ఇంటి ముందు వెళ్లేందుకు స్థానికులు భయపడేవారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఇంతలా జనాలు భయపడేవారు కాదేమో.. కానీ ఒకేసారి 11 మంది ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ఇంటి వైపు చూడాలంటేనే ప్రజలు జంకారు.
ఖాళీగా ఉన్న ఇంటిని కొనుగోలు చేసిన డాక్టరు
ఇక ఖాళీగా ఉన్న ఇళ్లును కొనేందుకు ఆసక్తి చూపారు మోహన్ సింగ్ అనే డాక్టర్. తనకు ఎలాంటి మూఢనమ్మకాలు లేవని వాటిని నమ్మనని చెబుతూ ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఓ డయాగ్నాస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశాడు. అంతేకాదు తనవద్దకు వచ్చే రెగ్యులర్ పేషెంట్లు కూడా వస్తున్నారని చెప్పారు. ఒకవేళ మూఢనమ్మకాలపై విశ్వాసం ఉంచి ఉంటే తను ఈ ఇంటిని కొనుగోలు చేసేవాడిని కాదని చెప్పుకొచ్చారు. ప్రధాన రహదారికి ఇళ్లు దగ్గరగా ఉండటంతోనే తాను ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు డాక్టర్ మోహన్ సింగ్.
ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిన పూజారి
తనకు మూఢనమ్మకాలపై ఎలాంటి విశ్వాసం లేదని డాక్టర్ మోహన్ సింగ్ చెబుతున్నప్పటికీ ఆ ఇంట్లో మాత్రం పూజారి పూజలు చేయడం కనిపించింది. అది కూడా ఎలాంటి దురాత్మలూ ఆ ఇంటి పరిసరాల్లోకి రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించడం కనిపించింది. గౌరీ-గణేష్ పూజ నిర్వహిస్తున్నామని కొత్తగా ఏది ప్రారంభించినా ఇది జరుగుతుందని పూజారి చెప్పారు. అయితే మూఢనమ్మకాలను విశ్వసించరాదని పూజారి చెప్పారు. మరోవైపు కొందరు స్థానికులు మాత్రం జరిగిందేదో జరిగిపోయిందని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబంలోని వ్యక్తులు చాలా మంచి వారని చెప్పారు. వారంతా కచ్చితంగా స్వర్గానికి వెళ్లి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాడు ఏమి జరిగింది..క్షుద్ర పూజలే ప్రాణాలు తీశాయా..?
ఇక నాడు ఏమి జరిగిందని ఒక్కసారి రివైండ్ చేసి చూస్తే బురారీ ప్రాంతంలోని ఆ ఇంట్లో 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు క్షుద్రపూజలు చేసేవారని అక్కడ దొరికిన సాక్షాధారాలను బట్టి పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఆ ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ఇనుప గ్రిల్కు 10 మంది వరుసగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఆ ఇంట్లోని పెద్దావిడ మాత్రం మరో గదిలో విగతజీవిగా కనిపించింది. ఆత్మహత్యకు పాల్పడిన వారు వారి నోళ్లకు టేప్ చుట్టేసుకున్నారు. కళ్లను ఓ బట్టతో కట్టేసుకున్నారు. ఇక ఇద్దరు మైనర్ పిల్లల కాళ్లు చేతులు కట్టివేయబడి ఉన్నాయి.