బ్యాక్ అండ్ బ్యాక్: బంగాళాఖాతంలో పుట్టుకు రానున్న రెండు అల్పపీడనాలు రెడీ: ముంచెత్తడమే ఇక
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన నివార్ పెను తుఫాన్ తీరాన్ని తాకింది. విధ్వంసాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. తుఫాన్ అనంతర పరిస్థితులను అధిగమించడానికి ఏపీ, తమిళనాడు, పుదచ్చేరి మల్లగుల్లాలు పడుతున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. ఒక తుఫాన్ వెళ్లిపోయిందనుకుని ఊపిరి పీల్చుకునేలోపే పిడుగులాంటి వార్తను వెల్లడిస్తున్నారు భారత వాతారణ శాఖ అధికారులు. మరో రెండు తుఫాన్లు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. కొద్దిరోజుల తేడాతో ఈ రెండూ దూసుకుని రావడం ఖాయమని అంటున్నారు.
Recommended Video
నివర్ తీరం దాటింది.. కానీ: చిత్తు కాగితాల్లా: భీతావహంగా తుఫాన్ అనంతరం పరిస్థితులు
బ్యాక్ అండ్ బ్యాక్
బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే.. ఈ రెండూ తుఫాన్లుగా మారడానికే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. ఈ నెల 29వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడుతుందని, అది వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. దాని తరువాత- వచ్చేెనెల 2వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడొచ్చని భావిస్తున్నారు. 29వ తేదీన ఏర్పడే అల్పపడనం తుఫాన్గా మారుతుందని అనుమానిస్తున్నారు. దీనికి బురెవి తుఫాన్గా నామకరణం చేయొచ్చు.
ఒడిశా తీరం సమీపంలో..
29వ తేదీన ఒడిశా తీరానికి సమపంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని, దీని ప్రభావం ఏపీ ఉత్తర ప్రాంత జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాలో బాలాసోర్, కేంద్రపారా, పూరీ, కటక్ వంటి ప్రాంతాలపై ఈ అల్పపీడన ప్రభావం పడొచ్చని అంటున్నారు. అల్పపీడనం పురోగమనం ఎలా ఉంటుందనేది అంచనా వేయడానికి ఇంకొంత సమయం పడుతుందని చెబుతున్నారు. అది తుఫాన్గా మారుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
తమిళనాడు సమీపంలో మరొకటి..
వచ్చేెనెల 2వ తేదీన తమిళనాడు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే నెల 10వ తేదీన కూడా మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉందని ఒడిశాకు చెందిన మెటెరోలాజిస్ట్ సురేంద్రనాథ్ పశుపాలక్ తెలిపారు. ఈ రెండు తుఫాన్ల ప్రభావం వల్ల తమిళనాడు నుంచి ఒడిశా వరకూ తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నివర్ తుఫాన్ ప్రభావం ప్రస్తుతం ఒడిశా మీద లేదు. చెదురుమదురు వర్షాలు కురిశాయే తప్ప వణికించిన సందర్భాలు లేవు. ఈ సారి బురెవి తుఫాన్ ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉంటుందని సురేంద్రనాథ్ చెప్పారు.
జోరుగా సహాయక చర్యలు..
నివర్ తుఫాన్ అనంతరం ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనడానికి తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. నేలకొరిగిన చెట్లను తొలగించే పనిలో పడ్డాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ముందు జాగ్రత్త చర్యగా వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను దింపారు. వారంతా ఇప్పుడు సహాయక, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.