సుడులు తిరుగుతూ..తీరం వైపు: దూసుకొస్తోన్న పెనుముప్పు: తీరాన్ని దాటేదెప్పుడో తేలింది
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న బురెవి.. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కన్యకుమారి వద్ద తీరాన్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలు, కేరళలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం ఖాయం. వారం రోజుల్లో తమిళనాడు రెండోసారి తుఫాన్ ముప్పును ఎదుర్కొనబోతోంది.
Recommended Video
ఏ దశలో ఉంది?
బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా శ్రీలంకలోని ట్రింకోమలీకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాన్. తమిళనాడులోని కన్యాకుమారికి 770, పంబన్కు 600 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ఈ తుఫాన్ ప్రభావం తొలుత శ్రీలంకపై పడుతుందని చెన్నైలోని భారతా వాతావరణ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ పువియరాసన్ తెలిపారు. శ్రీలంక ఉత్తర ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడతయాని పేర్కొన్నారు. క్రమంగా ఆ తుఫాన్ కన్యాకుమారి వైపు దూసుకొస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశామని అన్నారు.
95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
తుఫాన్ ప్రభావం వల్ల శ్రీలంకలో 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆయన అంచనా వేశారు. ట్రింకోమలీలో తుఫాన్ తీరం దాటబోదని, మరింత బలపడి తమిళనాడు దక్షిణ ప్రాంతం వైపు దూసుకొస్తుందని చెప్పారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమొరిన్ మీదుగా మరింత బలపడి కన్యాకుమారి-పంబన్ మధ్య తీరాన్ని తాకుతుందని పువియ రాసన్ తెలిపారు. దీని ప్రభావం గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని హెచ్చరించారు.
పంబన్పై పెను ప్రభావం..
తమిళనాడు తీరంలోని పంబన్ వద్ద తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, కన్యాకుమారి, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగై, విరుధ్నగర్ ప్రాంతాలు తుఫాన్ ప్రభావానికి గురి కానున్నట్లు పువియరాసన్ వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పత్తినంథిట్ట, అళప్పుజ జిల్లాలకు రెడ్ అలర్ట్ను ఇచ్చారు. కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు.
లక్షద్వీప్కూ ముప్పు..
లక్షద్వీప్ పైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం వరకు లక్షద్వీప్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పువియరాసన్ తెలిపారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుఫాన్ తీవ్రతను బట్టి తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరిల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలను మోహరించడానికి తమిళనాడు, కేరళ చర్యలు తీసుకున్నాయి.