రెండు రాష్ట్రాల్లో విలయం: శ్రీలంక సహా: తుఫాన్ పడగ: వారంలో రెండోసారి
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి.. పెను తుఫాన్గా మారింది. శుక్రవారం తీరాన్ని దాటనున్న ఈ తుఫాన్ ధాటికి శ్రీలంక ఉత్తర ప్రాంతం, తమిళనాడు, కేరళ దక్షిణ జిల్లాల్లో కొన్ని గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నాటికి శ్రీలంక, ఆ తరువాత తమిళనాడు వద్ద తుఫాన్ తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇదివరకే వెల్లడించారు. దీనికి సంబంధించిన హెచ్చరికలను జారీ చేశారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి.
శ్రీలంకకు అతి సమీపంలో..
బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా శ్రీలంకలోని ట్రింకోమలీకి 35 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాన్. తమిళనాడులోని కన్యాకుమారికి 360, పంబన్కు 260 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల శ్రీలంక ఉత్తర ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ శ్రీలంక ప్రభుత్వం పునరావాస చర్యలను కొనసాగిస్తోంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. బురెవి తుఫాన్.. ట్రింకోమలీకి సమీపిస్తోన్న కొద్దీ ఈదురుగాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వరకు గాలుల తీవ్రత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా..
ట్రింకోమలీ వద్ద తీరాన్ని దాటిన తరువాత తుఫాన్ మరింత బలపడి తమిళనాడు దక్షిణ ప్రాంతం వైపు దూసుకొస్తుందని చెప్పారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమొరిన్ మీదుగా కన్యాకుమారి-పంబన్ మధ్య తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకూ భారీ వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. తుఫాన్ తరువాత కూడా చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
పంబన్పై పెను ప్రభావం..
తమిళనాడు తీరంలోని పంబన్ వద్ద తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, కన్యాకుమారి, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగై, విరుధ్నగర్ ప్రాంతాలు తుఫాన్ ప్రభావానికి గురి కానున్నట్లు పువియరాసన్ వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పత్తినంథిట్ట, అళప్పుజ జిల్లాలకు రెడ్ అలర్ట్ను ఇచ్చారు. కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు.
కన్యాకుమారిలో మకాం వేసిన తమిళనాడు మంత్రి
తుఫాన్ వల్ల ప్రాణనష్టాన్ని నివారించడానికి తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. తమిళనాడు రెవెన్యూశాఖ మంత్రి ఉదయ్ కుమార్.. కన్యాకుమారిలో మకాం వేశారు. తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. సహాయ, పునరావస చర్యల గురించి ఆరా తీశారు. మండపం, పంబన్ సీ బ్రిడ్జి, తంగచ్చిమడంలోని తుఫాన్ కేంద్రాన్ని సందర్శించారు. పెయ్కరుంబు, ధనుష్కోడి, కరైయ్యూర్లల్లో వైపరీత్యాల నివారణ చర్యలను పర్యవేక్షించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మణికందన్, ఎన్ సతాన్ ప్రభాకర్, రామనాధపురం జిల్లా కలెక్టర్ దినేష్ పొన్రాజ్ ఒలివర్ తదితరులు ఉన్నారు.
Recommended Video
పంబన్ పోర్ట్లో ఏడో నంబర్ హెచ్చరిక
తుఫాన్ తీరం దాటుతుందని భావిస్తోన్న పంబన్ వద్ద ఏడో నంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. రామేశ్వరం, పంబన్, ధనుష్కోడి ప్రాంతాల్లో 600 మందికి పైగా ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా బలగాలను మోహరింపజేశారు. తిరునెల్వేలి, తెన్కాశి, రామనాథపురం వంటి జిల్లాల్లో 57 ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధం చేశారు. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొల్లం, కోచి, రత్నగిరి, మంగళూరు, గోవా, లక్షద్వీప్, వెరావల్, ముంబైల నుంచి రక్షణ బలగాలను రప్పించారు. ఆయా ప్రాంతాల నుంచి 129 అదనపు డీప్-సీ బోట్లను తెప్పించారు.