బురెవి..బలహీన పడినా: ఏకధాటి వర్షాలతో బెంబేలు: 5 జిల్లాల్లో పబ్లిక్ హాలిడే: ఎయిర్పోర్ట్ క్లోజ్
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి.. తమిళనాడు వద్ద తీరాన్ని దాటిన అనంతరం బలహీన పడింది. అయినప్పటికీ తమిళనాడు, కేరళ దక్షిణ జిల్లాల్లో కొన్ని గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో ఎనిమిది, కేరళల్లో అయిదు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మత్స్యకార గ్రామాలు వరదనీటితో నిండిపోయాయి.
Recommended Video
ఐటీ ప్రొఫెషనల్స్కు బిగ్ రిలీఫ్: ఆ బిల్లును ఆమోదించిన అమెరికా సెనెట్: ట్రంప్ చేతుల్లో ఫైనల్
ఇప్పటికే వేలమందిని తీర ప్రాంతం నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించాయి తమిళనాడు, కేరళ అధికార యంత్రాంగాలు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల కేరళ ప్రభుత్వం పలు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. తిరువనంతపురం విమానాశ్రయాన్ని మూసివేసింది. ఎనిమిది గంటల తరువాతే విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
భారీ వర్షాలు పడుతోన్న అయిదు జిల్లాల్లో కేరళ ప్రభుత్వం శుక్రవారం పబ్లిక్ హాలిడేను ప్రకటించింది. భారీ వర్షాల బారిన పడిన తిరువనంతపురం, కొల్లం, పత్తినంథిట్ట, అళప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో హలిడేను వర్తింపజేశారు. కేరళలో రెండువేలకు పైగా పునరావాస శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రింకోమలీ వద్ద తీరాన్ని దాటిన తరువాత తుఫాన్ తమిళనాడు దక్షిణ ప్రాంతం వైపు దూసుకొచ్చింది. తమిలనాడులోని రామనాథపురం సమీపంలో తీరాన్ని తాకిన అనంతరం బలహీన పడింది.
తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గట్లేదు. భారీ వర్షాలు పడుతున్నాయి. రామేశ్వరం, పంబన్, ధనుష్కోడి, తిరునెల్వేలీల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల సముద్రం చొచ్చుకుని వచ్చింది. మత్స్యకార గ్రామాలు జలమయం అయ్యాయి. తిరునెల్వేలి, తెన్కాశి, రామనాథపురం వంటి జిల్లాల్లో 57 ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధం చేశారు. తమిళనాడులో ఎనిమిది వేల మందికి పైగా తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కేరళలోని అయిదు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తోన్న పలువురిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.