వెరైటీ దొంగలు... పోలీస్ స్టేషన్నే దోచుకున్నారు!
పోలీస్. ఆ పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే తెలియని భయం ఆవహిస్తుంది. అలాంటిది కొందరు దొంగలు మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్కే కన్నం వేశారు. పోలీసుల కన్నుగప్పి దొరికినకాడికి దోచుకుపోయారు. ఉత్తర్ప్రదేశ్లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దారుణం : టిక్టాక్ సెలబ్రిటీని చంపేశారు..!
మే 18న పోలీసుల కన్నుగప్పి స్టేషన్లోకి చొరబడ్డ దొంగలు స్టోరూంలో దొరికిన వస్తువును దొరికినట్లు ఎత్తుకుపోయారు. పలు కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర వస్తువులను స్టోర్రూంలో భద్రపరచగా.. చోరులు వాటన్నింటినీ మాయం చేశారు. 90బ్యాటరీలు, రెండు గ్యాస్ సిలిండర్లు, ఫోన్లు, సీసీ టీవీ కెమెరాలు, కార్ల విడిభాగాలు వారు ఎత్తుకెళ్లిన వాటిలో ఉన్నాయి. చోరీ జరిగిన 24 గంటల తర్వాత స్టోర్ ఇంఛార్జ్ గది తాళం పగలగొట్టి ఉన్న విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీతో సంబంధమున్న ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసి వారి నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.