బుర్హాహన్ వనీ ఎన్కౌంటర్: ప్రాణభయంతో ఏడ్చాడు
శ్రీనగర్: తన రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టగానే కరుడు గట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీ ఏడ్వడం ప్రారంభించాడని అంటున్నారు. జులై 8వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని చుట్టిముట్టి 22 ఏళ్ల వనీతో పాటు మరో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చిన విషయం తెలిసిందే.
15 ఏళ్ల వయస్సులోనే హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి కొద్ది కాలంలోనే టాప్ కమాండర్గా ఎదిగిన బుర్హాన్ వనీ తాను తలదాచుకున్న స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టగానే విలపించడం ప్రారంభించాడని అంటున్నారు. యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించిన బుర్హాన్ వనీ ఇండియన్ ఆర్మీకి మోస్ట్ వాంటెడ్గా మారాడు.
కరుడుగట్టిన కమాండర్గా పేరు తెచ్చుకున్న వనీచివరి నిమిషంలో ప్రాణభయంతో చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడనే వార్త ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2010లో తన సోదరుడిని సెక్యూరిటీ సిబ్బంది వేధించారనే ఒకే ఒక్క కారణంతో వనీ ఉగ్రవాదంవైపు మళ్లాడు.
తను తల దాచుకున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడాన్ని చూసిన 22 ఏళ్ల వనీ ఏడుస్తూనే బలగాలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని చెబుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది కేవలం నాలుగు నిమిషాల్లోనే పని పూర్తి చేసింది.