హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రి
హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్భర్. హిందువులు ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లలో ఎవరైనా రాజకీయనాయకుడు మృతి చెందారా అని ప్రశ్నించారు. మతంపై రాజకీయం చేసి హింసను ఊతమిచ్చే రాజకీయనాయకులను మంటల్లో వేసి కాల్చి చంపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హిందువులను ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజ్భర్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉన్న ప్రతి పౌరుడు భారతీయుడే అని గుర్తెరగాలని సూచించారు. అతన్ని బయటకు పంపలేరని రాజ్భర్ అన్నారు. బీజేపీకి తమతో కలిసి రావడం ఇష్టం లేకపోతే ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగడం కానీ మరొక పార్టీతో కలిసి వెళ్లడంపై ఆలోచిస్తామని రాజ్భర్ చెప్పారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్లో యోగీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న రాజ్భర్ బీజేపీకి తలనొప్పిగా మారారు. ఇంతకు ముందు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.