‘ఓలా’ ఢమాల్! లాభాలు పెరిగినా.. నష్టాలు మూడింతలు! తీవ్ర పోటీయే కారణమా?
దేశీయ దిగ్గజ ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా మూడు రెట్లు పడిపోయి, భారీ నష్టాలను మూటగట్టుకుంది. వేతనాలు, మార్కెటింగ్, టెక్నాలజీలపై పెట్టిన వ్యయాలు అత్యధికంగా ఉండటంతో ఓలా నష్టాల బారినుంచి తప్పించుకోలేకపోయింది.
ముంబై: దేశీయ దిగ్గజ ట్యాక్సీ అగ్రిగేటర్ 'ఓలా' భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు మూడింతలు పెరిగి రూ.2,313.6 కోట్లుగా నమోదయ్యాయి.
వేతనాలు, మార్కెటింగ్, టెక్నాలజీలపై పెట్టిన వ్యయాలు అత్యధికంగా ఉండటంతో ఓలా నష్టాల బారినుంచి తప్పించుకోలేకపోయింది. గ్లోబల్ దిగ్గజం ఉబర్ నుంచి వస్తున్న గట్టి పోటీ కూడా ఓలాను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
ఉబర్ కు పోటీగా రైడ్స్ పై ప్యాసెంజర్లకు డిస్కౌంట్స్ ఇవ్వడం, డ్రైవర్లకు ఎక్కువగా చెల్లించడం కూడా ఓలాపై ప్రతికూల ప్రభావం చూపించిందనే చెప్పాలి. మరోవైపు నష్టాలతో పాటు ఓలాకు వచ్చే రెవెన్యూలు కూడా భారీగానే పెరిగాయి.
గతేడాది కంటే ఈ ఏడాది ఓలా రెవెన్యూ గ్రోత్ ఏడు రెట్లు పెరిగి రూ.103.7 కోట్ల నుంచి రూ.758.2 కోట్లకు చేరుకుంది. నివేదికల ప్రకారం 12 నెలల కాలంలో వేతనాలపై రూ.381 కోట్లు, అడ్వర్ టైజింగ్ పై రూ.437 కోట్లు, టెక్నాలజీపై రూ.120 కోట్లను ఓలా ఖర్చు చేసింది.
గతంలో ఓలా విలువను 450 కోట్ల డాలర్లుగా లెక్కకట్టగా, 2016లో దీన్ని 300 కోట్ల డాలర్లకు తగ్గించినట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఓలా, ఉబర్ లు డ్రైవర్ల నిరసనలతో ప్రస్తుతం వారికి ఇచ్చే ప్రోత్సహకాలను తగ్గిస్తున్నాయి.