గుంతలో చితాభస్మం.. పైన ఓ మొక్క, గంగలో కలపొద్దు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
చితాభస్మాన్ని గంగలో కలపకుండా ఓ గుంత తవ్వి అందులో పోసి దానిపై ఓ మొక్కనాటాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ చెప్పారు.దీని ద్వారా మున్ముందు తరాలు కూడా చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటారని
హరిద్వార్: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చితాభస్మాన్ని గంగలో కలపకూడదని అన్నారు. మంగళవారం సత్యపాల్ నమామి గంగ మిషన్లో భాగంగా హరిద్వార్లో 34 ప్రాజెక్ట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చితాభస్మాన్ని గంగలో కలపకుండా ఓ గుంత తవ్వి అందులో పోసి దానిపై ఓ మొక్కనాటాలని చెప్పారు.దీని ద్వారా మున్ముందు తరాలు కూడా చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటారని పేర్కొన్నారు.
మన కారణంగా పవిత్ర గంగా నది కాలుష్యం కాకూడదని సత్యపాల్ అన్నారు. ఈ విషయంలో పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించే వారు కూడా తమ వద్దకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
సత్యపాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో పెళ్లిలో వధువు జీన్స్ వేసుకుని వస్తే ఎంత మంది అబ్బాయిలు ఆమెను పెళ్లిచేసుకుంటారు అని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు.