వరదలో కొట్టుకుపోయిన ఆర్మీ బస్సు: దూకేసి బయటపడ్డ జవాన్లు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. బీజాపూర్లో కూంబింగ్కు వెళ్లి తిరిగివస్తుండగా.. బస్సు వరదలో కొట్టుకుపోయింది. వెంటనే అలర్టయిన జవాన్లు.. బస్సు నుంచి బయటకు దూకేయడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారు. వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. మల్కన్గిరి బీజాపూర్ రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అయితే, ఈ వరద నీటిలోనే జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లింది.
అయితే, మధ్యలోకి రాగానే వరదనీరు ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన జవాన్లు.. బస్సులోంచి దిగి వరద నీటి నుంచి బయటికి వచ్చారు. వరద నీరు తక్కువగా ఉందని బస్సును ముందుకు పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగానే ఉంటాయి. ఇటీవలి కాలంలో మరింతగా మావోయిస్టుల సంచారం పెరిగిందనే సమాచారంతో ఛత్తీస్ గఢ్ తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. తెలంగాణలో రెండ్రోజుల క్రితం ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు నేతలు ఆరోపించారు.