విషాదం: స్కూలు బస్సులో చెలరేగిన మంటలు..నలుగురు విద్యార్థులు సజీవదహనం
సంగ్రూర్/పంజాబ్: పంజాబ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అయితే అధికారికంగా మాత్రం ఎవరూ ధృవీకరించలేదు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా సిమ్రాన్ పబ్లిక్ స్కూలు విద్యార్థులుగా గుర్తించడం జరిగింది.
బస్సులో మంటలు ఎలా చెలరేగాయో అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్శ్యాం తోరీ చెప్పారు. ఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి సంగ్రూర్ ఎస్డీఎం మరియు తహసీల్దార్లను పంపినట్లు చెప్పారు. ఇక సహాయక చర్యల కోసం ఎస్ఎస్పీ సందీప్ గార్గ్ పోలీసులను పంపారు. ఇక విద్యార్థులకు అత్యవసర ప్రాతిపదికన వైద్యం అందేందుకు పలువురి డాక్టర్లను అధికారులు ఉంచారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సంగ్రూర్ నియోజకవర్గం ఆప్ ఎంపీ భగవంత్ మన్ మరియు ఎమ్మెల్యే అమన్ అరోరాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న స్థానికులు నిరసనలు తెలిపారు. స్కూలు వ్యానులో ఉన్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్నారు. ఓ కమిటీగా ఏర్పడ్డ స్థానికులు మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన చిన్నారులకు రూ.20 లక్షలు పరిహారంగా చెల్లించాలన్నారు.
ఘటనకు కారణమైన వారిని గుర్తించి అరెస్టు చేసి వారిపై హత్య కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. ప్రైవేట్ స్కూలు యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి ఘటనపై మెజిస్టేట్తో విచారణకు ఆదేశించారు. సంగ్రూర్లో స్కూలు వ్యాన్లో మంటలు చెలరేగి నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు.