ఉగ్రదాడి: బస్డ్రైవర్ అప్రమత్తతో 75మంది బ్రతికారు
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్లోని దీనానగర్లో ఈరోజు బీభత్సం సృష్టించిన ఉగ్రవాదుల్ని చూసి బస్సు డ్రైవర్ ఏ మాత్రం భయపడలేదంట. అంతే కాదు బస్సు డ్రైవర్ సాహసం 75 మంది ప్రాణాలను కాపాడింది.
ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్పై దాడి చెయ్యడానికి ముందు ఈ బస్పై కాల్పులు జరిపారు. పంజాబ్ రోడ్వేస్కు చెందిన నానక్ చెంద్ అనే బస్సు డ్రైవర్ ఉగ్రవాదులను చూసి ఏ మాత్రం భయపడకుండా, ఉగ్రవాదులపైకే బస్సుని పోనిచ్చాడంట.
దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హడలెత్తి కాస్త వెనకడుగు వేశారు. దాంతో వెంటనే బస్సును పక్కకు మళ్లించిన డ్రైవర్ నానక్ చంద్ దాన్ని వేగంగా అవతలకు తీసుకెళ్లిపోయాడు. బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఎవరైనా గాయపడి ఉంటారన్న ఆలోచనతో బస్సును నేరుగా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిపోయాడు.
గాయపడ్డ ప్రయాణీకులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం పోలీసులకు పోన్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. తన బస్సులో 75 మంది ప్రయాణీకులున్నారని, వారి ప్రాణాలే తనకు ముఖ్యమని భావించి బండిని ఆపకుండా తీసుకెళ్లిపోయానని చెప్పాడు.
తమ డ్రైవర్ అప్రమత్తత వల్ల 75 మంది ప్రాణాలను కాపాడగలిగామని పంజాబ్ రోడ్వేస్ జనరల్ మేనేజర్ ప్రశంసల జల్లు కురిపించారు.