దుర్ఘటన: జమ్మూలో లోయలో పడ్డ బస్సు..17 మంది మృతి
జమ్మూ: తెలంగాణలోని జగిత్యాలలో బస్సు అదుపుతప్పి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందిన ఘటన మరువకముందే జమ్మూకశ్మీర్లో మరో మినీ బస్సు లోయలోకి పడిపోవడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. రంబన్ జిల్లాలోని జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే పై ఈ దుర్ఘటన జరిగింది.
ప్రాణాలంటే లెక్క లేదు: కోతికి స్టీరింగ్ అప్పగించిన బస్సు డ్రైవర్
బనిహాల్ నుంచి రంబన్కు వెళుతున్న మినీ బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణం ఓవర్లోడ్ కావడమే అని పోలీసులు పేర్కొన్నారు. బనిహాల్ నుంచి రంబన్కు వెళుతున్న బస్సు కేలామోర్ ప్రాంతానికి చేరుకోగానే అదుపుతప్పి 300 అడుగుల లోయలోకి పడిపోయిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ, పారామిలటరీ దళాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించాయి. అయితే ఈ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారనేదానిపై కచ్చితంగా చెప్పలేమని అధికారులు వెల్లడించారు. తీవ్రగాయాలైన వారిని చికిత్స కోసం హెలికాఫ్టర్లలో తరలించారు. కొందరిని చందర్కోట్కు తరలించగా మరికొందరిని జమ్మూకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
బస్సును నడుపుతున్న రహ్మతుల్లా చాలా అనుభవంగల డ్రైవర్ అని... ప్రయాణికులు అతన్నే కోరుకుంటారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ బస్సు ఓవర్లోడ్ అవడంతోనే లోయలోకి పడిపోయిందని వారు చెప్పారు.