ఢిల్లీలో పౌరసత్వ నిరసన జ్వాలలు: బస్సులు దగ్ధం: మా పని కాదంటోన్న జామియా వర్శిటీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం నిరసన ప్రదర్శనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. హింసాత్మకంగా తయారయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ప్రదర్శనలు నిర్వహిస్తోన్న ఆందోళనకారులు.. ఆదివారం మరింత రెచ్చి పోయారు. బస్సులకు తగుల బెట్టారు. ఈ చర్యకు జామియా యూనివర్శిటీ విద్యార్థులే కారణమంటూ మొదట్లో వార్తలు తలెత్తాయి. యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాత్రం దీన్ని కొట్టి పారేశారు. ఆ చర్య తమది కాదని స్పష్టం చేశారు.
#CAB #NRC violence spreads to #Delhi This is New friends colony pic.twitter.com/c3rCsuXQFQ
— Arjun Yadav (@arjun102) December 15, 2019
వేర్వేరు ప్రాంతాల్లో బస్సులపై దాడి..
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఆదివారం సాయంత్రం న్యూ ఫ్రెండ్స్ కాలనీ, ఆశ్రమ్ ఫ్లైఓవర్, సుఖ్ దేవ్ విహార్ సహా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు ఢిల్లీ ప్రజా రవాణా సంస్థ బస్సులను తగులబెట్టారు. మరి కొన్నింటి అద్దాలను పగుల గొట్టారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఢిల్లీలో తొలిసారిగా హింసాత్మకం
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు సహా పలువురు ఆందోళనకారులు కొద్దిరోజులుగా వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన తరువాత తొలిసారిగా దేశ రాజధానిలో ఈ తరహా ఉద్రిక్త వాతావరణం, అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.
తోసిపుచ్చిన జామియా విద్యార్థులు..
దీనితో అందరి వేళ్లూ జామియా మిల్లియా యూనివర్శిటీ విద్యార్థుల వైపే చూపించాయి. జామియా వర్శిటీ విద్యార్థులే ఈ చర్యకు పాల్పడి ఉంటారంటూ వార్తలు వెలువడిన మరుక్షణమే వారు స్పందించారు. తాము అలాంటి మూర్ఖపు చర్యలకు పాల్పడలేమని అన్నారు. శాంతియుతంగా తాము నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తున్నామని, బస్సులపై దాడి చేయడం, వాటిని తగులబెట్టడం, అద్దాలను ధ్వంసం చేయడం వంటి అప్రజాస్వామ్య పద్ధతులకు తాము దిగలేదని స్పష్టం చేశారు.
ఆందోళనకారులపై భాష్పాయువు గోళాల ప్రయోగం..
ఎన్నిరోజులైనా తాము శాంతియుతంగానే నిరసనలను వ్యక్తం చేస్తామని అన్నారు. బస్సులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కూడా వారు ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా- బస్సులపై దాడికి పాల్పడిన ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పెద్ద ఎత్తున భాష్పాయువు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులపై కొన్ని చోట్ల లాఠీఛార్జి కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బస్సులను తగులబెట్టిన తరువాత నల్లటి పొగలు అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.