'టీ కప్పులో తుఫాను': విధులకు హాజరైన నలుగురు జడ్జీలు
venugopal, chelameswar, dipak misra, four judges press meet, supreme court, వేణుగోపాల్, చలమేశ్వర్, దీపక్ మిశ్రా, నలుగురు న్యాయమూర్తుల ప్రెస్ మీట్
న్యూఢిల్లీ: నలుగురు అసంతృప్త న్యాయమూర్తులు ఎప్పటిలాగే సోమవారంనాడు తమ విధులకు హాజరయ్యారు. చలమేశ్వర్ సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే.
అవాంఛనీయమైన సంక్షోభాన్ని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ టీ కప్పులో తుఫానుగా అభివర్ణించారు. జనవరి 12వ తేదీ తర్వాత తిరుగుబాటు ప్రకటించిన న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గోగోయ్, మదన్ బి లోకూరు, కురియన్ జోసెఫ్ సోమవారంనాడు తమ తమ విధులకు హాజరయ్యారు.
సమస్య పరిష్కారమైనందన వేణుగోపాల్ చెప్పారు. ప్రతిదీ పరిష్కారమైందని, కోర్టులు పనిచేస్తున్నాయని, ఇది టీ కప్పులో తుఫాను అని ఆయన ఎన్డీటీవితో అన్నారు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు వచ్చినప్పుడు దీపక్ మిశ్రా నవ్వి ఊరుకున్నారని, ఏ విధమైన సమాదానం ఇవ్వలేదని తెలుస్తోంది.
ఆదివారంనాడు జస్టిస్ దీపక్ మిశ్రాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏడుగురు ప్రతినిధులు, సుప్రీంకోర్టు బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కలిశారు. సమస్య పరిష్కారమవుతుందని, సహృదయ భావన ఏర్పడుతుందని జస్టిస్ దీపక్ మిశ్రా హామీ ఇచ్చారు.
ఇది అంతర్గత వ్యవహారమని, పరిష్కారమైందని, తాము దాదాపు 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమావేశమయ్యామని, వివాదాన్ని సాకుగా చూపించి రాకీయ పార్టీలో ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని, మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఎప్పటిలాగే కోర్టులకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారని బిసిఐ చైర్మన్ మనన్ మిశ్రా చెప్పారు.