ఆదుకోని బై బ్యాక్: అసలేం జరిగింది?.. అమెరికా ఫోకస్, అదే తేలితే ఇన్ఫీకి దెబ్బే?
పలువురు ఇన్వెస్టర్లు చేసిన ఆరోపణల ఆధారంగా అమెరికా ఫెడరల్ ఏజన్సీ ఇన్ఫీ తాజా పరిణామాలపై విచారణ చేపట్టనుంది.
బెంగళూరు: సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా ఇన్ఫోసిస్ కంపెనీని కోలుకోలేని దెబ్బ తీసింది. షేర్ల బై బ్యాక్ ఆఫర్ ప్రకటించినప్పటికీ.. ఇన్వెస్ట్రర్ల నుంచి ఆశించిన స్థాయి స్పందన లభించడం లేదని తెలుస్తోంది.
విశాల్ రాజీనామా తర్వాత త్వరితగతిన నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టినా ఇన్ఫోసిస్ కు ఆశించని ఫలితం దక్కకపోవడం సంస్థను కలవరపెడుతోంది.
ఇన్ఫీ బైబ్యాక్ కు.. విశాల్ సిక్కా ఎఫెక్ట్? రేపటి బోర్డు సమావేశమే కీలకం!
కాగా, ఇన్ఫోసిస్ షేర్ విలువను డౌన్ గ్రేడ్ చేయడంతో.. ప్రారంభ ట్రేడింగ్ లో ఇన్ఫోసిస్ షేర్లు 4.39శాతం పడిపోయి రెండేళ్ల కనిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సిక్కా రాజీనామా చేసిన రోజు .. మార్కెట్ ప్రారంభంలోనే షేర్లు పతనమవడం ప్రారంభించాయి. ఇంట్రాడేలో దాదాపు 13శాతం మేర షేరు విలువ పడిపోయింది.
ఆదుకోని బై బ్యాక్:
ఈ దెబ్బతో ఇన్ఫీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30వేల కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది. రాజీనామా తర్వాత ఇన్ఫీ ప్రకటించిన బై బ్యాక్ ఆఫర్ మొత్తం ఈక్విటీలో 4.92శాతం కాగా, ఈ ఆఫర్ కంపెనీని అంతగా ఆదుకోవడం లేదనే చెబుతున్నారు. మరోవైపు పోటీదారులైన టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రోలు లాభాల బాటలో పయనిస్తుండటం గమనార్హం.
Recommended Video
బ్రోకరేజ్ సంస్థల హెచ్చరిక:
'ప్రస్తుతం ఇన్ఫీని వెంటాడుతున్న కష్టాలతో 2017-18ఆర్థిక సంవత్సరం గైడెన్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం' ఉందంటూ బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బై బ్యాక్ ఆఫర్ లో షేరు ధర రూ.1,150 నిర్ణయించినప్పటికీ.. తిరిగి మార్కెట్ ప్రారంభమయ్యేటప్పటికీ అది రూ.882.55 వద్ద కనిష్ట స్థాయిలను నమోదు చేసింది.
అమెరికా విచారణ:
ఇప్పటికే ఉన్న కష్టాలకు తోడు ఇన్ఫోసిస్ పై పలువురు ఇన్వెస్టర్లు చేసిన ఆరోపణల ఆధారంగా అమెరికా ఫెడరల్ ఏజన్సీ విచారణ చేపట్టనుంది. ఇన్ఫోసిస్, దాని కార్యాలయాల్లో, డైరెక్టర్లూ ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను అతిక్రమించారా? అన్న విషయమైన నాలుగు యూఎస్ న్యాయవాద సంస్థలు విచారణ చేపట్టాయి.
విచారణలో అలా తేలితే కష్టమే:
బ్రాన్ స్టియన్, జివిర్ట్ అండ్ గ్రాస్ మన్, రోసెన్ లా ఫర్మ్, పోమెరాంట్జ్ లా ఫర్మ్ అండ్ గోల్డెబెర్గ్ లా పీసీ సంస్థలు ఈ విచారణ చేపట్టనున్నాయి. సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేస్తున్న తప్పుడు ప్రచారంతోనే సిక్కా బలవంతంగా సంస్థను వీడాల్సి వచ్చిందని బోర్టు చేసిన ఆరోపణలపైనా వీరు దృష్టి సారించారు. విచారణలో ఇన్వెస్టర్లకు నష్టం జరిగేలా ఇన్ఫోసిస్ వ్యవహరించిందని తేలితే.. సంస్థపై దావా వేసేందుకు న్యాయవాద సంస్థలు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.