ఇది చాలా ఇబ్బంది: 2050 నాటికి దక్షిణ భారతంలో 20 శాతం ఎక్కువ జనాభా వీరిదే
రానున్న ముప్పై ఏళ్లలో దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్దాప్య జనాభా పెరుగుతుందని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. 2050 నాటికి 65 ఏళ్లు పైబడిన వారు 20 శాతం ఎక్కువగా ఉంటారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 30శాతం, కేరళ 25శాతం, కర్నాటక 24.6శాతం, తమిళనాడులో 20.8 శాతం మేరా వృద్ధాప్య జనాభా పెరగవచ్చని జోస్యం చెప్పింది. మొత్తం మీద 2050 నాటికి 65 ఏళ్లకు పైబడి ఉన్నవారు 178 కోట్లు ఉంటారని వెల్లడించింది.
వృద్ధాప్య జనాభాలో పెరుగుదల కనిపిస్తే యువ కార్మికులు ఉత్తర భారతం, తూర్పు భారతం నుంచి దక్షిణ రాష్ట్రాలకు వలస వస్తారని పేర్కొంది. ఇలా వలసలు ఎక్కువ అవడంవల్ల సామాజికంగాను, మౌలికసదుపాయాల కల్పనపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని వెల్లడించింది. అంతేకాదు వలసలు ఎక్కువ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదలలో కూడా చాలా తేడా ఉంటుందని వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు నిధుల పంపకాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తుందని చెప్పింది. ఇప్పటికే తలసరి ఆదాయం ఉత్తరాది రాష్ట్రాలకన్నా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని ఎస్బీఐ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న జనాభాతో తలసరి ఆదాయం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు అత్యల్పంగా 11.1 శాతంగా ఉంది. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఇతర సమస్యలు కొని తెచ్చుకుంటున్నాయని రీసెర్చ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికన కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. అయితే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో చాలా నష్టపోతున్నాయని రిపోర్టు తెలిపింది. అంతేకాదు వృద్ధాప్య జనాభా ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వెల్లడించింది. అంతేకాదు ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.