సెంట్రల్ జైలుకు కోర్టు నోటీసులు వస్తే బెయిల్ అనుకుని హంతకుల విడుదల, విచిత్రం !
బెంగళూరు: కోర్టు నుంచి వచ్చిన నోటీసులను బెయిల్ పేపర్లు అని భావించిన జైళ్ల శాఖ అధికారులు ఇద్దరు హంతకులను విడిచిపెట్టిన విచిత్ర సంఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు హంతకులను అధికారులు విడిచిపెట్టడంతో అధికారులు షాక్ కు గురైయ్యింది.
కర్ణాటకలోని మంగళూరులో బీజై కేఎస్ఆర్ టీసీ బస్ స్టాప్ సమీపంలో 2016లో కద్రి రోహిత్ కోట్యాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శివాజీ, జగదీష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు శివాజీ, జగదీష్ లను మంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
జులై 9వ తేదీన కోర్టు నుంచి నిందితులు శివాజీ, జగదీష్ లకు నోటీసులు జారీ అయ్యాయి. సెంట్రల్ జైలులో ఉన్న శివాజీ, జగదీష్ లకు నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న జైళ్ల శాఖ అధికారులు వాటిని బెయిల్ పేపర్లును అని భావించారు.
కనీసం వచ్చిన పేపర్లు పరిశీలించకుండా శివాజీ, జగదీష్ లకు బెయిల్ వచ్చిందని పై అధికారులకు సమాచారం ఇచ్చారు. పై అధికారుల ఆదేశాల మేరకు నియమాల ప్రకారం శివాజీ, జగదీష్ లను జైలు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన హంతకులు నేరుగా వారి న్యాయవాదులను కలిశారు.
తాము బెయిల్ ఇప్పించలేదని, మీరు ఎలా విడుదలైనారని న్యాయవాదులు ప్రశ్నించారు. షాక్ కు గురైన న్యాయవాదులు వెంటనే కోర్టుకు సమాచారం ఇచ్చారు. కోర్టు జైళ్లు శాఖ అధికారులకు చివాట్లు పెట్టి వెంటనే ఇద్దరిని అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
హాయిగా ఇంటిలో ఉన్న శివాజీ, జగదీష్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మళ్లీ మంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయం బయటకురాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే విషయం బయటకు రావడంతో జైళ్ల శాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.