జ్యోతిరాదిత్య భవిష్యత్.. చౌహాన్ సర్కార్ ప్రతిభకు గీటురాయి
భోపాల్: మధ్యప్రదేశ్లోని గుణ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాల ఫలితాలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ప్రజల నాడిని తెలియజేస్తాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా జ్యోతిరాదిత్య సింధియాను ప్రకటించాలా? వద్దా? అన్న సంగతిని తేలుస్తాయని అంటున్నారు.
ముంగావోలీ, కొలారస్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు గుణ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. గుణ పార్లమెంట్ స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా ప్రాతినిధ్యం వహించడంతోపాటు సింధియా రాజ వంశీయులకు కంచుకోట.
సింధియాను సవాల్ చేసేందుకు చౌహాన్ ప్లాన్ ఇలా
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నేతగా నిలువాలని కలలు కంటున్న జ్యోతిరాదిత్య సింధియాకు, తద్వారా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేందుకు గల ప్రతి అవకాశాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ వినియోగించుకున్నారు. రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కీలకమైన గిరిజన ఓటర్ల మనస్సు చూరగొనేందుకు ప్రయత్నించారు. సహారియా గిరిజనులకు ఒక్కొక్కరికి రూ.1000 పెన్షన్ ప్రకటించారు.
చిత్రకూట్ స్ఫూర్తితో జ్యోతిరాదిత్య ప్రచారం ఇలా
అనునిత్యం కొలారియా, ముంగావోలీ అసెంబ్లీ సెగ్మెంట్లలోనే పర్యటిస్తున్న జ్యోతిరాదిత్య సింధియాను ఢీకొట్టేందుకు యావత్ క్యాబినెట్ మంత్రులందరినీ ప్రచార బరిలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం కావాలని కలలు కంటున్న జ్యోతిరాదిత్య సింధియా సహజంగానే ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల చిత్రకూట్ అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికలో మాదిరిగానే రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంతోపాటు మరింత మెజారిటీ సాధించాలని జ్యోతిరాదిత్య, కాంగ్రెస్ పట్టుదలగా, దీమాగా పని చేశాయి.
శివ్ పురిలో కేవలం రెండు హామీలే అమలు
సీఎం శుష్క వాగ్దానాలు చేయడంలో దిట్ట అని జ్యోతిరాదిత్య సింధియా ఎదురుదాడికి దిగారు. 2017లో జరిగిన శివ్ పురి అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో 146 హామీలిస్తే వాటిలో రెండు అమలయ్యాయని గుర్తు చేశారు. తాజాగా ముంగావోలీ, కొలారస్ స్థానాల్లో 425 హామీలిస్తే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని తేల్చేశారు.
గెలుపుపై సీఎం చౌహాన్కు భారీ ఆశలు
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల పరిధిలో విజయంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే నైతికంగా ఆయన, బీజేపీ ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఆయనపై, ఆయన ప్రభుత్వ వ్యతిరేకత కీలక ప్రభావం చూపుతాయని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్రూపుల మధ్య ఐక్యతకు దారి
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాల్లో విజయం సాధిస్తే ఆ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా బలం మరింత సంఘటితం కావడానికి దోహద పడుతుంది. పార్టీలోని సీనియర్ల సారథ్యంలోని గ్రూపుల మధ్య ఐక్యత తేవడానికి వీలవుతుంది. ఇప్పటికే చిత్రకూట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. అయితే దీని విజయం క్రెడిట్.. అసెంబ్లీలో విపక్ష నేత.. మాజీ సీఎం అర్జున్ సింగ్ తనయుడు అజయ్ సింగ్కు వెళ్లింది.
సింధియాపైనే కాంగ్రెస్ హై కమాండ్ ఆశలు
కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాతోపాటు సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వారిలో అజయ్ సింగ్ కూడా ఉన్నారు. కానీ జ్యోతిరాదిత్య సింధియాపైనే కాంగ్రెస్ హై కమాండ్ ఆశలు పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణిక్రుతం కావడంతోపాటు సింధియా స్థానం బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఉమాభారతి కోసం బీజేపీ నేతలు ఇలా
ముంగావోలీ, కొలారస్ అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల పేర్ల ప్రస్తావన చాలా అరుదుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ఓటర్లపై ఆశలు పెట్టుకుంటే బీజేపీ పట్టణ ఓటర్లను ఆకర్షించడంపైనే ద్రుష్టి సారించింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేకత కారణంగా కేంద్ర మంత్రి ఉమా భారతిని సీఎంగా పెట్టాలని కోరుతున్న బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీలో మాదిరిగానే కమలనాథులు రెండు వర్గాలుగా చీలిపోయారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నర్మదా పరిక్రమ పేరిట ఇలా దిగ్గిరాజా పాదయాత్ర
2003లో సీఎంగా దిగ్విజయ్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ‘నర్మదా పరిక్రమ' పేరుతో యాత్ర నిర్వహిస్తున్నా.. కొద్ది మంది యువ నేతలు మినహా దిగ్విజయ్ సింగ్ పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నదన్న అభిప్రాయం ఉంది. పరిస్థితి ఇలాగే సాగితే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాగలదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీల అమలులో ప్రధాని మోదీ తీరుపై యువత ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తున్నది.
ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ పైనా ఇలా ఎన్నికల ఫలితం ప్రభావం
ముంగావోలీ, కొలారస్ అసెంబ్లీ స్థానాల పరిధిలో రెండు పార్టీలు చెరోసారి గెలుపొందుతున్నాయి. కొలారస్ స్థానంలో బీజేపీ నాలుగు సార్లు గెలుపొందితే, కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించింది. తొలిసారి రెండు పక్షాలు హోరాహోరీ పోరాడటంతోపాటు విజయంపై ఆశలు పెట్టుకున్నాయి. అంతేకాదు ఈ రెండు స్థానాల ఉప ఎన్నికల ఫలితం కూడా పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ లోని రమణ్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.