శ్రీనగర్ ఉప ఎన్నిక: పెట్రోల్ బాంబులతో దాడి, కాల్పుల్లో ముగ్గురి మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఉప ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్ లోకసభ స్థానానికి, ఓ అసెంబ్లీ స్థానానికి, లాగే మధ్యప్రదేశ్లో రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు పలుచోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
శ్రీనగర్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. బుద్గాం పోలింగ్ స్టేషన్ వద్ద వేర్పాటువాద ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
భద్రతా బలగాలు.. ఆందోళనకారులను పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిని మొహ్మద్ అబ్బాస్(20), పైజాన్ అహ్మద్(15)గా పోలీసులు గుర్తించారు.
మరోవైపు చందూర అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పోలింగ్ బూత్పై రాళ్లు రువ్వారు. దీంతో పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
బుద్గాం, గందేర్బల్ ప్రాంతాల్లోను ఇదే పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా బుద్గాం జిల్లాలోని హర్డోవల్వాన్ గ్రామంలోని పోలింగ్ స్టేషన్పై ఉగ్రవాదులు పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో భద్రతా సిబ్బంది, స్థానిక పౌరులు గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లో..
మధ్యప్రదేశ్లోని బందవ్ గఢ్ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరగడం లేదని అధికారులు చెప్పారు. బింద్ ఏరియాలో కాంగ్రెస్ నేత కారుపై ఇద్దరు ఆందోళనకారులు దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ వారే ఈ దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.