కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహం
రాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్లో 15 మంది ట్రాన్స్ జెండర్ల వివాహ వేడుక జరగడం టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఇక ట్రాన్స్జెండర్ల సామూహిక వివాహాన్ని ముంబైకి చెందిన చిత్రగాహి ఫిల్మ్స్ నిర్మాత తన సొంత ఖర్చుతో జరిపిస్తున్నారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రాన్స్జెండర్లకు ఇక్కడ వివాహం జరిపిస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న సలోని గులాం
ఎనిమిదేళ్ల క్రితం సలోని అనే ట్రాన్స్జెండర్ మహిళ గులామ్ నబీ అన్సారీ అనే వ్యక్తిని కలసింది. ముందుగా స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆతర్వాత ప్రేమలో పడి ఒక్కటయ్యారు. వారి ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమను అంగీకరించలేదు. అంతేకాదు సమాజం కూడా వీరిని చిన్న చూపు చూసింది. అయితే శనివారం రోజున మాత్రం ఈ అవమానాలను, అభాండాలను అన్నీ మరిచి వారిద్దరూ ఒక్కటయ్యారు. గులాం సలోని మెడలో తాళి కట్టి ఆమెను అర్థాంగిగా స్వీకరించాడు. ఏదైనా ఒకటి కావాలని బలంగా కోరుకుంటే ప్రపంచమంతా నీకు సహకరిస్తుంది అంటూ సంతోషం వ్యక్తం చేసింది ట్రాన్స్జెండర్ మహిళ సలోని.
తొలిసారిగా ట్రాన్స్జెండర్ మహిళలకు వివాహం
దేశంలోనే ఇలా ట్రాన్స్జెండర్ మహిళలకు వివాహం కావడం తొలిసారి అని సలోని చెప్పింది. రాయ్పూర్లో నివాసముంటున్న ట్రాన్స్జెండర్ మరియు సామాజిక కార్యకర్త విద్యా రాజ్పుత్ ఇతరులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సలోని వివరించింది. ముందుగా తమ ప్రేమను రహస్యంగానే ఉంచాలని భావించినట్లు చెప్పుకొచ్చింది సలోని. వారి ప్రేమ గురించి ఇద్దరి కుటుంబాల్లో చెప్పగానే ట్రాన్స్జెండర్ కాబట్టి అంగీకరించలేదని సలోని ఆవేదన వ్యక్తం చేసింది.
2014లో ట్రాన్స్జెండర్లను థర్డ్ జెండర్స్గా సుప్రీం గుర్తింపు
2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్స్ను థర్డ్ జెండర్గా గుర్తించింది.అంతేకాదు వారికి రాజ్యాంగపరంగా అన్ని హక్కులు లభిస్తాయని పేర్కొంది. దీన్ని అనుసరించే సలోని గులాంలు కలిసి జీవితం పంచుకోవాలని భావించారు. ఇంతకు ముందు చాలా సార్లు ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలని భావించాము కానీ దానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని సలోని చెప్పింది. ఇలాంటి వివాహం ఒకటి జరుగుతుందని వినగానే వెంటనే సంప్రదించి ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకున్నట్లు సలోని తెలిపింది. అయితే తాము ఇద్దరం ఒక్కటవుతామని తమ కలలో కూడా ఊహించలేదని గులాం చెప్పాడు. వీరిది ఇలా ఉంటే మరో ట్రాన్స్జెండర్ మహిళ ఇషికాను పంకజ్ అనే అబ్బాయి ప్రేమించాడు .అయితే వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించారు. అంతేకాదు ఇషికాను తమ కోడలుగా స్వీకరిస్తున్నామని పంకజ్ తల్లి రాధా చెప్పారు.
చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనం
వివాహానికి వేదికగా నిలిచిన పూజారి పార్క్ మ్యారేజ్ ప్యాలెస్
ఇక ట్రాన్స్జెండర్ మహిళల సామూహిక వివాహానికి వేదికగా నిలిచింది పూజారి పార్క్ మ్యారేజ్ ప్యాలెస్. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. వివాహం తర్వాత అంబేడ్కర్ భవన్ నుంచి సివిల్ లైన్స్ వరకు ఊరేగింపు జరిగింది. ట్రాన్స్జెండర్లు సమాజంలో చిన్న చూపుకు గురవుతున్నారని రాజ్పుత్ చెప్పింది. అందుకే వీరికోసం సామూహిక వివాహం జరిపించాలని నిర్ణయించి నట్లు విద్యారాజ్పుత్ చెప్పారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున ప్రేమలో ఉండి పెళ్లి కాకుండా ఉన్న ట్రాన్స్జెండర్ మహిళలను కలిసినట్లు తెలిపిన రాజ్పుత్... వారికి వివాహం చేయాలని భావించినట్లు చెప్పింది. 15 మంది ట్రాన్స్జెండర్ మహిళల్లో ఏడుగురు ఛత్తీస్గఢ్కు చెందినవారు కాగా, రెండు జంటలు గుజరాత్, రెండు జంటలు మధ్యప్రదేశ్, ఒకరు బీహార్, మరొకరు మహారాష్ట్ర , ఇంకొకరు పశ్చిమబెంగాల్కు చెందిన వారని విద్యా రాజ్పుత్ చెప్పారు.