ఉపఎన్నికల ఫలితాలు 2022 : యూపీ, త్రిపురలో బీజేపీ హవా-పంజాబ్ లో అకాలీల ముందంజ
యూపీ, పంజాబ్, త్రిపుర, ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గాసాగుతోంది. వీటిలో కొన్ని చోట్ల ఫలితాలు వెలువడగా.. మరికొన్ని చోట్ల కౌంటింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరిగినా పలు కారణాలతో ఫలితాలు కొన్ని చోట్ల ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయి.
ఏపీలోని ఆత్మకూరు ఆసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై పోటీ చేసిన సమీప బీజేపీ ప్రత్యర్ధి భరత్ కుమార్ కేవలం 10 వేల ఓట్లు సాధించి డిపాజిట్లు కోల్పోయారు. సిట్టింగ్ సభ్యుడు చనిపోతే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ సహా పలు పార్టీలు నిర్ణయం తీసుకుని పోటీకి దూరంగా ఉండిపోయాయి. దీనికి విరుద్ధంగా పోటీ చేసిన బీజేపీ పరువు పోగొట్టుకుంది.
మరోవైపు యూపీలోని రాంపూర్, ఆజంగఢ్ ఎంపీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్దులు వెనుకంజలో ఉన్నారు. ఎస్పీకి పట్టున్న రాంపూర్, ఆజంగఢ్ సీట్లలో బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. రాంపూర్ లో ఆజం రజా, ఆజంగఢ్ లో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ వెనుకబడ్డారు. దీంతో యూపీలో ఎస్పీకి ఎదురుదెబ్బలు తప్పేలా లేవు.
అటు పంజాబ్ లో సీఎం భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో ఖాళీ అయిన సంగ్రూర్ ఎంపీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అనూహ్యంగా అకాలీదళ్ అభ్యర్ధి సిమ్రన్ జీత్ సింగ్ మాన్ ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే అధికార పార్టీ ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. మరోవైపు త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడు సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఓ సీటులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. టౌన్ బర్దోలీ సీటు నుంచి పోటీ చేసిన సీఎం మానిక్ సాహూ .. ముందంజలో ఉన్నారు. ఢిల్లీలోని రాజీందర్ నగర్ స్ధానానికి జరుగుతున్న ఉపఎన్నికలో ఆప్ అభ్యర్ధి దుర్గేష్ పట్నాయక్ ముందంజలో ఉన్నారు. జార్ఖండ్ లోని మందార్ అసెంబ్లీ సీటుకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ముందంలో ఉన్నారు.