కార్యకర్తలారా! చెప్పేదొక్కటే, ఉపఎన్నికలు మేల్కొలుపు, చైనా-పాకిస్తాన్ పార్టీలకు ఓటేయరు!: స్వామి
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 4 లోకసభ, 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మేల్కొలుపు అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా అసంతృప్తికి లోను కావొద్దని పిలుపునిచ్చారు.
చదవండి: అహంకారం, అలా చేస్తే తిప్పేయొచ్చు: బీజేపీ ఓటమిపై సుబ్రహ్మణ్యస్వామి, అభివృద్ధి చేసినా.. చంద్రబాబు పేరు
మంచి పేరు కలిగిన, పలుకుబడి కలిగిన నేతలను, పార్టీ కార్యకర్తలను ముందుకు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యకర్తలకు అందరం గౌరవం ఇవ్వాలన్నారు. ఈ పార్టీ కార్పోరేట్ ఆఫీస్లా కాదన్నారు. అందరికీ నేను చెప్పిదే ఒక్కటేనని.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మనందరికీ మేల్కొలుపు అన్నారు.
ఈసారి ప్రజలు చాలాచోట్ల కులప్రాతిపదికన ఓట్లు వేశారని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కలిశారని, దానిని తాను వ్యతిరేకించనని, అలయెన్స్ వారి ఇష్టమని చెప్పారు.
మనం ఓడినప్పటికీ అసంతృప్తి అవసరం లేదని, హిందువుల్లోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్నించాలన్నారు.
ఉప ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చాలా కీలకమైన అంశాలు చూస్తారని చెప్పారు. గ్రాండ్ అలయెన్స్ (విపక్షాల కూటమి) బీజేపీపై ఏకమైతే పాకిస్తాన్, చైనా వంటి దేశాలు మనపై ఆధిపత్యం చెలాయిస్తారని అందరికీ తెలుసునని చెప్పారు.
ఎందుకంటే చైనా పార్టీ అయిన కమ్యూనిస్ట్, పాకిస్తాన్కు మద్దతిచ్చే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయన్నారు. కాబట్టి మన దేశ యువత ఆ పార్టీలకు ఓటు వేయదన్నారు. యువత వద్దకు మనం వెళ్లి వారికి ఓటింగ్ ప్రాధాన్యతను తెలియజెప్పాలన్నారు.