బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచే ప్రయత్నం: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం: !
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమకాలీన అంశాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి పావులు కదుపుతోంది. బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచేలా ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఆప్ ప్రభంజనంతో చతికిల..
ఢిల్లీ.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించేంత అభిమానం ఢిల్లీవాసుల్లో ఉంది. అది ఒకప్పుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాటాన్ని కొనసాగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని గట్టిపోటీ ఇవ్వలేక చతికిలపడుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీని ఓడించడానికి వ్యూహాలను పన్నుతోంది.
అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో సీఏఏకు బ్రేక్..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న బీజేపీ అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ ఎన్నికల ప్రధాన అస్త్రంగా మార్చుకోనుంది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే..ఢిల్లీ పరిధిలో పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్)లను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమంటూ హామీని ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలో అధికారిక ప్రకటన..
ఈ దిశగా కసరత్త చేస్తోంది. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించిన తరువాత.. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించనుంది. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్)ల అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఆ పార్టీ జాతీయ నాయకులు పరిశీలిస్తున్నారు. ఈ మూడింటినీ అమలు చేయబోమంటూ హామీని ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మేనిఫెస్టోలో చోటు కల్పించే ఛాన్స్..
దీనిపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తన నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే సమయం నాటికి దీనిపై ఓ స్పష్టత వస్తుందని అంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీజేపీకి పూర్తి భిన్నంగా మారిపోయాయని, వాటిని సొమ్ము చేసుకోవాలని పార్టీ అధిష్ఠానం పట్టుదలగా కనిపిస్తోందని చెబుతున్నారు.