పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టం భారత్లో నివసిస్తున్న ముస్లింలకు ఎటువంటి నష్టం చేకూర్చదంటూ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిరసన తెలపడం అనేది భారత రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన హక్కు అని అన్నారు. మనకు నచ్చని విషయంపై నిరసన తెలపడాన్ని ఎవరూ ఆపలేరు కానీ.. అది శాంతియుతంగా, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని చేయాలని షాహీ ఇమామ్ అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌరసత్వ నమోదుకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. అది కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులు భారత పౌరసత్వం పొందడానికి మాత్రమేనని ఆయన వివరించారు.
భారతీయులకు నష్టం లేదు: ఒడిశా సీఎం
పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అనేది విదేశీయులకు సంబంధించిన విషయమని, విదేశీ శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మాత్రమేనని ఆయన అన్నారు. అందుకే తాము పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలిపామని చెప్పారు.
అయితే, తాము జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ)కి మద్దతు తెలపడం లేదని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు.