ముస్లింలను విస్మరించడం వెనక, శ్రీలంక తమిళులు కూడా, పుదుచ్చేరిలో అమలుచేయం: నారాయణస్వామి
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న భోపాల్లో సీఎం కమల్నాథ్ మెగా ర్యాలీ తీయగా, ఇవాళ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో డీఎంకే, వీసీకే నేతలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నేతల వేషధారణలో..
పుదుచ్చేరిలో మూడుకిలోమీటర్ల పాటు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో కొందరు మహాత్మాగాంధీ, పెరియార్, జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వేషధారణలో కనిపించారు. 3 వేల మందితో కలిపి నారాయణస్వామి ర్యాలీ తీశారు. సీఏఏపై కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అమలు చేయం..
పుదుచ్చేరిలో సీఏఏ అమలు చేయబోమని నారాయణస్వామి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో సీఏఏ అమలు చేయవని, అలాగే పుదుచ్చేరిలో సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయనని స్పష్టంచేశారు. సీఏఏలో ముస్లింలను కావాలనే మోడీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. దానిని తమ రాష్ట్రంలో అమలు చేయమని క్లారిటీ ఇచ్చారు.
హిందూత్వమే..
సీఏఏ, ఎన్ఆర్సీ ముఖ్య ఉద్దేశం దేశాన్ని హిందుత్వగా మార్చడమేనని విమర్శించారు. అందుకోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మోడీ ప్రభుత్వ చర్యను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోవని తేల్చిచెప్పారు. ఈ విషయం మోడీ, అమిత్ షా గుర్తుంచుకోవాలని సూచించారు.
తమిళులపై కూడా..
శ్రీలంకకు చెందిన తమిళులను కూడా సీఏఏలో చేర్చారని పేర్కొన్నారు. దీంతో దేశంలో ఉన్న వారు కూడా పౌరసత్వం రాదని, ఇదీ మోడీ ప్రభుత్వం కావాలని చేసిన కుట్ర అని విమర్శించారు. సీఏఏలో ముస్లింలను కావాలనే విస్మరించి, హిందూత్వ వాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న అన్నీ వర్గాలు, అన్నీ మతాలను సమానంగా చూడలే తప్ప, కొందరిపై వివక్ష చూపడం సరికాదు. ఆయా వర్గాలు చేసిన తప్పు ఏంటీ అని ప్రశ్నించారు.