ఆ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టంను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను తొలిసారిగా విచారణ చేయడం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అదే సమయంలో పిటిషనర్లు చెబుతున్నట్లుగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అనేదానిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రప్రభుత్వానికి సూచించింది. గతవారం పార్లమెంటులో పౌరసత్వ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. పొరుగుదేశాల నుంచి మతపరమైన అణిచివేతకు గురైన ముస్లింయేతర శరణార్థులకు భారత పౌరసత్వం చట్టం కల్పించనుంది.
హిందువులకు మైనార్టీ హోదా ఇవ్వలేం.. దీన్ని దేశ పరిధిలో చూడాలి.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంలో పిటిషన్లు
మొత్తం మీద పౌరసత్వ సవరణ చట్టంను సవాలు చేస్తూ 60 పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన చాలా పిటిషన్లు ఎంపీలు వేసినవే కావడం విశేషం. కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ మరియు నలుగురు ప్రజాప్రతినిధులు ముందుగా సుప్రీంకోర్టులో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారు.ఆ తర్వాత కాంగ్రెస్ నేత జైరాం రమేష్, అసదుద్దీన్లాంటి వారు ఉన్నారు. మతప్రాతిపదికన భారత పౌరసత్వం కల్పించడమనేది తప్పని చెబుతూ బిల్లులో ఒక మతం వారికి అన్యాయం చేస్తూ రూపొందించారని కోర్టు దృష్టికి తమ పిటిషన్ల ద్వారా తీసుకొచ్చారు.
చట్టంలో ఏముంది..భగ్గుమన్న ఈశాన్యం
పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్కు డిసెంబర్ 31, 2014లోపల వలస వచ్చిన ముస్లింయేతర వ్యక్తులకు భారత పౌరసత్వం కల్పిస్తూ కేంద్రం బిల్లును పాస్ చేసింది. దీనిపై ఈశాన్య రాష్ట్రాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రోడ్లెక్కాయి. నిరసనలు అక్కడ మిన్నంటాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలను నిలువరించేందుకు కేంద్రబలగాలు రంగంలోకి దిగాయి. ఇక క్రమంగా ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలను తాకాయి. పలు యూనివర్శిటీ విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా యూనివర్శిటీలను తాకిన నిరసనలు
ఆదివారం రోజున జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు విద్యార్థులపై దాడులకు దిగారని విమర్శలు వెల్లువెత్తాయి. హింసకు సంబంధం లేని విద్యార్థులపై కూడా పోలీసులు దాష్టీకం ప్రదర్శించారని జామియా మిలియా యూనివర్శిటీ అధికారులు చెప్పారు. ఇక జామియా విద్యార్థులకు మద్దతుగా ఉత్తర్ప్రదేశ్లోని పలు యూనివర్శిటీ విద్యార్థులు తమ నిరసనలు తెలిపారు.