అసెంబ్లీ ఎన్నికల వేళ..బీజేపీ సాహసం: తెరపైకి వివాదాస్పద చట్టం: సీఏఏ అమలు తేదీ వెల్లడి
న్యూఢిల్లీ: కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. మరోమారు వివాదాలకు ఆజ్యం పోసినట్టవుతోంది. వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
Recommended Video
జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు..
2021 జనవరి నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గీయ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో నివసిస్తోన్న శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర 24 పరగణ జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలను సంధించారు.
సీఏఏతో విముక్తి..
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన శరణార్థులకు ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే కేంద్రంలోని తమ ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని, దాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో ఎన్నో అవమానాలకు గురైన.. స్వదేశానికి తరలివచ్చిన శరణార్థులను ఆదుకోవడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. వారందరికీ భారత పౌరసత్వాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఇప్పటికే ఈ చట్టం అమలులో జాప్యం నెలకొందని పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా..
తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని కైలాష్ విజయ్వర్గీయ ఆరోపించారు. తమ పార్టీ ర్యాలీపై తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే బాంబులు విసిరారని ఆరోపించారు. ఇలాంటి దాడులను మమతా బెనర్జీ దగ్గరుండ తృణముల్ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ బలపడుతోండటాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రవాణాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన సువేందు అధికారి బీజేపీలో చేరుతారనే విషయంపై తనకు స్పష్టత లేదని అన్నారు.
బీజేపీ సాహసం చేస్తోందా?
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని జనవరి నుంచి అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందంటూ కైలాష్ చేసిన ప్రకటన చర్చనీయాంశమౌతోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్లల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అస్సాం, తమిళనాడు మినహా మిగిలిన చోట్ల బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు.
అమలు సాధ్యమేనా?
సీఏఏకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలన్నింట్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. సీఏఏకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ తీర్మానాలను కూడా చేశాయి. తమిళనాడులో బీజేపీ మిత్రపక్షంగా ఉంటోన్న అన్నా డీఏంకేకు కూడా సీఏఏను అమలు చేయడానికి పెద్దగా సుముఖంగా లేదు. బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటోన్న రజినీకాంత్ సైతం.. తాను ఆ చట్టాన్ని సమర్థించట్లేదంటూ చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు స్పష్టం చేయడం ఆసక్తి రేపుతోంది.