సీఏఏపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. బంగ్లాలో హిందువులు సేఫ్.. మోడీ ఏం చేస్తున్నారో అర్థంకావట్లేదు..
బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్థాన్ లో మతపరమైన హింస, వేధింపులకు తట్టుకోలేక భారత దేశానికి వచ్చిన హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నవేళ ఇదే అంశంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత 'గల్ఫ్ న్యూస్' పత్రికకు ఆదివారం ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
హిందువులపై దాడులు లేవు..
బంగ్లాదేశ్ జనాభా16 కోట్లుకాగా, అందులో 10.7 శాతం మంది హిందువులేనని, వాళ్లంతా సురక్షితంగా ఉన్నారని, మతపరంగా వారిపై ఎలాంటి వేధింపులు జరగడంలేదని షేక్ హసీనా తెలిపారు. భారత్ నుంచి బంగ్లాదేశ్ కు తిరుగువలసలు లేవని ఆమె స్పష్టం చేశారు. సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత భారత్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నామంటూ బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆమె పరోక్షంగా సమర్థించారు.
అది మాకు అనవసరం..
కాగా, సీఏఏ అవసరంలేదన్నది బాంగ్లాదేశ్ ఉద్దేశమే అయినప్పటికీ.. అది భారతదేశ అంతర్గత వ్యవహారం కాబట్టి దీనిపై ఎలాంటి జోక్యం ఉండబోదని షేక్ హసీనా క్లారిటీ ఇచ్చారు. ‘‘సీఏఏ, ఎన్సార్సీ అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. గతేడాది భారత పర్యటన సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ చట్టాలతో బంగ్లాకు ఎలాంటి ఇబ్బందులుండవని మోదీ పర్సనల్ గా నాకు హామీ ఇచ్చారు''అని హసీనా పేర్కొన్నారు.
ఇండియాకు మేమే నంబర్ 1 దోస్త్
బంగ్లా ప్రధాని హసీనా కంటే ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ సీఏఏపై స్పందిస్తూ.. భారత్ లో టెన్షన్ వాతావరణం నెలకొనడం ఆందోళనకరమని, ఆ ప్రభావం పొరుగుదేశాలపైనా ఉంటుందని అన్నారు. అయితే భారత్ కు సంబంధించి బంగ్లాదేశ్ ఎల్లప్పుడూ నంబర్ వన్ స్నేహితురాలిగానే కొనసాగిందని, సీఏఏ, ఎన్సార్సీ అంశాలు ముమ్మాటికీ ఇండియా ఇంటర్నల్ విషయాలేనని ఆయన చెప్పారు.