సీఏఏ, ఎన్ఆర్సీ ఎఫెక్ట్: పశ్చిమబెంగాల్ ప్రత్యర్థి జట్ల ఫుట్బాల్ ఫ్యాన్స్ ఏకమయ్యారు!
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో కూడా జనవరి 27న సీఏఏ వ్యతిరేక తీర్మానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఆదివారం స్టేట్ టాప్ టీమ్స్ ఈస్ట్ బెంగాల్, మోహున్ బేగన్ ఫుట్బాల్ జట్లు డెర్బీలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే, ఇరుజట్ల అభిమానులు కూడా సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ ఒక్కతాటిపైకి వచ్చారు.
'మేము ఈ భూమిని రక్తంతో సాధించుకున్నాం. పేపర్లతో కాదు' అని రాసివున్న బ్యానర్లను ఇరు జట్ల అభిమానులు కూడా ప్రదర్శించడం గమనార్హం. ఈస్ట్ బెంగాల్ క్లబ్కుసంప్రదాయబద్దంగానే బంగాల్స్(బంగ్లాదేశ్, తూర్పు పాకిస్థాన్ నుంచి వచ్చినవారు) నుంచి మద్దతు ఉంటుంది.
మోహున్ బేగన్ జట్టుకు ఘోటిస్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజల మద్దతు ఉంటుంది. వీరు చారిత్రక ప్రత్యర్థులు. కొన్ని బ్యానర్లు ఇరు జట్లను వ్యతిరేకించుకుంటూ ఉన్నప్పటికీ.. ఒక బ్యానర్ మాత్రం ఇరు జట్లకు మద్దతుగా కనిపించడం గమనార్హం. 'ప్రియమైన పుత్రుడా.. మీకు మా దేశం స్వాగతం పలుకుతోంది' అని రాసివుంది.
మోహున్ బేగన్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి ఉంటుంది. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీ కారణంగా ఈ జట్లు ఏకమైనట్లు కనిపించడం గమనార్హం. అనేక జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించారు.
కాగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొని, వేధింపులకు గురై అక్కడ బతకలేని పరిస్థితిలో మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, తదితర మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సీఏఏ అమలుకు సంబంధించిన గెజిట్ను కూడా కేంద్రం ఇటీవలే విడుదల చేసింది.