దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. ఇలాంటి చర్యలు అల్లర్లను ఆపగలవా?: పౌరసత్వ పిటీషన్పై సుప్రీం షాకింగ్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్పై ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. పిటీషన్లపై ఆయన ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను నివారించడానికి ఇలాంటి పిటీషన్లు ఏవీ పెద్దగా ఉపయోగపడబోవని అన్నారు. అల్లర్లు, హింసాత్మక వాతావరణం తగ్గిన తరువాతే విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన: సైకిలెక్కిన మాజీ ముఖ్యమంత్రి..!
ఇలాంటి పిటీషన్లు అల్లర్లను తగ్గిస్తాయా?
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, అల్లర్లు, హింసాత్మక వాతావరణం నెలకొనడం పట్ల బొబ్డె అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ నిరసనలను వ్యక్తం చేయాల్సిన తీరు ఇది కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిటీషన్లను దాఖలు చేయడం కంటే అల్లర్లు తగ్గడానికి అవసరమైన చర్యలు చేపడితే బాగుంటుందని హితవు పలికారు.
ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడంపై దేశ ప్రజల్లో సమగ్ర అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించేలా చేయాలని కోరుతూ పునీత్ కౌర్ ధండా అనే న్యాయ విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్పై గురువారం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది.. ఎస్ఏ బొబ్డెతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. విచారణ ఆరంభించిన కొద్దిసేపటికే బొబ్డె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి పిటీషన్ను తొలిసారిగా చూస్తున్నా..
దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పిటీషన్ను తాను తొలిసారిగా చూస్తున్నానని బొబ్డె అన్నారు. పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించిన చట్టంపై ఇలాంటి పిటీషన్ దాఖలు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. న్యాయ విద్యార్థిగా ఇలాంటి విషయాల పట్ల సమగ్ర అవగాహనను కలిగి ఉండాల్సిన అవసరం కూడా ఉందని పునీత్ కౌర్ ధండాకు సూచించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తపూరక వాతావరణాన్ని, హింసాత్మక పరిస్థితులను ఇలాంటి పిటీషన్లు ఏమాత్రం తగ్గించబోవని అన్నారు.
సమగ్ర ప్రచారం కల్పించేలా..
పునీత్ కౌర్ ధండా అనే న్యాయ విద్యార్థిని పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ఈ చట్టం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవని, భవిష్యత్తులోనూ ముప్పు ఉండబోదనే విషయాన్ని తెలియజేసేలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించేలా చేయాలని కోరుతూ ఆమె దీన్ని దాఖలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిందనే అపోహ ప్రజల్లో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.