మా ఆయుధం అదే.. గుండు కొట్టించుకొని నిరసన.. కొత్త ఏడాదిన ఉద్రిక్తంగా ఆందోళనలు!
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా అసోంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు తమ ఆందోళనను ఉద్యమంగా మార్చి ప్రజలను చైతన్య పరచేందుకు ప్రయత్నిస్ుత్నారు. జోర్హాట్, గొలాఘాట్, నాగావ్, దిబ్రుగఢ్ ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. సీఏఏను వెంటనే రద్దు చేయాలని గౌహతిలో వేలాది మంది విద్యార్థులు, ప్రజలు కదం తొక్కారు. కొత్త తరహా నిరసనతో ఆందోళన తీవ్రతను మరింత పెంచారు. వివరాల్లోకి వెళితే..
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన: సైకిలెక్కిన మాజీ ముఖ్యమంత్రి..!
అసోంలో తీవ్రస్థాయిలో నిరసనలు
గౌహతిలో విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా కదం తొక్కారు. ఆల్ అస్సాం లా స్టూడెంట్ యూనియన్ వేలాది మంది ప్రజలతో కలిసి నిరసన ర్యాలీని నిర్వహించారు. సీఏఏను ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని, అలాగే చట్టాన్ని అమలు చేయొద్దు అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. సీఏఏ కోరల నుంచి అసోంను విముక్తి చేయండి అంటూ ఓ చిత్రకారుడు ప్లకార్డుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మా గళమే ఆయుధం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ ఆందోళనలు కొనసాగుతాయి. ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసనలను వ్యక్తం చేస్తాం. నిరసనను వ్యక్తం చేసే మా గళమే మా ఆయుధం. ఒకవేళ ప్రభుత్వం మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే.. మా వాయిస్ మరింత పెరుగుతుంది అని ఆల్ అస్సాం లా స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మీడియాతో అన్నారు. అసోం వ్యాప్తంగా అన్ని కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సీఏఏ ఆందోళనకు మద్దతు తెలపాలని కోరారు.
అడ్డుకొనేందుకు ప్రభుత్వం, వర్సిటీలు
ఇదిలా ఉండగా, సీఏఏ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనకుండా చూడాలని వైస్ ఛాన్స్లర్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయకుండా కట్టడి చేయాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పరీక్షలను రద్దు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో విద్యార్థిగా తమ విధిని పూర్తి చేసి పరీక్షలు రాస్తాం. పౌరులుగా మా బాధ్యతను గుర్తు చేసుకొని ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటాం అని విద్యార్థులు తెలిపారు.
గుండు కొట్టించుకొని నిరసన
సీఏఏ ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లడానికి స్టూడెంట్ యూనియన్ నేతలు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. గౌహతిలో పలువురు నిరసనకారులు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేస్తూ గుండు కొట్టించుకొన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాన్ని తమ రుద్దుతున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.